వానకాలం పంటల సాగు ప్రణాళికను వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. అన్నదాతలకు లాభాన్ని చేకూర్చే దిశగా ఈసారి పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. మొత్తం 6.10 లక్షల ఎకరాల్లో వానకాలం పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసి అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. అత్యధికంగా 2.70లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
గతేడాది వానకాలం సీజన్తో పోలిస్తే 40 వేల ఎకరాల పత్తి సాగు పెంచుతూ కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే 1.50 లక్షల ఎకరాల్లో కంది, 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగు ప్రణాళిక ప్రకారం ఈ వానకాలంలో 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానుండగా.. ఈ నెలాఖరులోగా అన్నదాతలకు అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
-వికారాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): వానకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఏడాది కొన్ని పంటల సాగును పెంచుతూ.. మరికొన్ని పంటల సాగును తగ్గిస్తూ ప్లాన్ను సిద్ధం చేశారు. అయితే గత వానకాలం సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 30 వేల ఎకరాల సాగును అదనంగా పెంచారు. ఈ వర్షాకాలంలో పత్తి, కంది పంటల సాగును భారీగా పెంచాలని..అందుకోసం రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించిన దృష్ట్యా ఆ దిశ గా జిల్లా వ్యవసాయాధికారులు చర్యలు తీసు కుం టున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 40వేల ఎకరాల్లో పత్తి పంట సాగు పెరుగనున్నదని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలను రూపొందించింది. గతేడాది 2.30 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా..
ఈ సారి 2.70 లక్షల ఎకరాల్లో పత్తిని పం డించేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అదేవిధంగా కంది పంట కూడా గతేడాదితో పోల్చి తే 20 వేల ఎకరాల్లో అదనంగా సాగు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది 1.31 లక్షల ఎకరాల్లో పంట సాగు కాగా, ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వరి, మొక్కజొన్న తదితర పంటల సాగు తగ్గుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ఈ వానకాలంలో 6.10 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి-2.70 లక్షల ఎకరాల్లో.. కంది-1.50 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న-40,000 ఎకరాల్లో, వరి-1.30 లక్షల ఎకరాల్లో, మినుములు-5,252 ఎకరాల్లో, సోయాబీన్-2,999 ఎకరాల్లో, పెసర్లు- 12,690 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికను రూపొందించారు. అయితే గతేడాది 5.81 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, వరి-1,34,857 ఎకరాలు, మొక్కజొన్న-55,751, జొన్న-2033 ఎకరాలు, కందులు-1,31,284 ఎకరాలు, పెసర్లు- 13,453 ఎకరాలు, మినుములు-5175 ఎకరాలు, పత్తి-2,30,285 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు ..
వర్షాకాల సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలను ఈనెలాఖరులోగా అందుబాటులో ఉంచే లా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో పీఏసీఎస్, డీలర్లు, కంపెనీల గోదాంలు, మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేయనున్నారు. యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్ని కలిపి 74,683 మెట్రిక్ టన్నులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందు లో యూరియా 28,867 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,360, కాం ప్లెక్స్ ఎరువులు 21,899, ఎంవోపీ 6,206 , ఎస్ఎస్పీ 2,351 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని నిర్ణయించారు.
అదేవిధంగా జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుందని అంచనా వేయగా అందుకు 5.80 లక్షల ప్యా కెట్ల పత్తి విత్తనాలు, వరికి సంబంధించి 33,922 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న-2,716 క్విం టాళ్లు, పెసర్లు-761, కందులు-5272 క్వింటాళ్లు, మినుములు-315 క్వింటాళ్లు, సోయాబీన్-899 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే పత్తితోపాటు ఇతర పంటలను సాగు చేసే రైతులు వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పత్తి , కంది సాగు పెరిగేలా రైతులకు అవగాహన కల్పిస్తాం
రానున్న వానకాలంలో పత్తి, కంది పంటల సాగును పెంచుతూ సాగు ప్రణాళికను సిద్ధం చేశాం. పత్తి, కంది పంటల సాగును భారీగా పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా ఈనెలాఖరులోగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటాం.
– గోపాల్, వ్యవసాయాధికారి వికారాబాద్ జిల్లా