ధారూరు, మార్చి 15 : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి కోట్పల్లి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ కోట్పల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా సమృద్ధిగా ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వల మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. ధారూరు మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో 1100ఎకరాలు, పెద్దేముల్ మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు 8100 ఎకరాలకు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించకుండా ప్రస్తుతం 50శాతం మాత్రమే వ్యవసాయానికి నీరు అందించడం జరుగుతుందని.. పూర్తి స్థాయిలో వ్యవసాయానికి నీరు అందించేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఏప్రిల్, మే రెండు నెలలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచుతూ పనులను వేగవంతం చేసి రెండు నెలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులకు నీరందించే దిశగా జిల్లా యంత్రాంగం పూర్తి సహకారాన్ని అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తికానట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, రైతుబంధు సమితి, గ్రామ పెద్దలతో గ్రామ సభలు నిర్వహించి ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించి అంచనాలను రూపొందించి పనులు చేపట్టాలన్నారు. ఏప్రిల్ మాసం నుంచి యంత్రాలను ఉపయోగించకుండా ఉపాధి హామీ కూలీలతో పనులు మొదలు పెట్టాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోడ్ల ఏర్పాటుకు అవసరాల మేరకు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆయకట్టు కింద వ్యవసాయం చేసుకుంటున్న రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదని కలెక్టర్ ను అభ్యర్థించగా దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిశీలించి పరిష్కారించాలని సూచించారు. కలెక్టర్ వెంట నీటిపారుదలశాఖ ఈఈ సుందర్నాయక్, ధారూరు, పెద్దేముల్ ఎంపీడీవోలు చంద్రశేఖర్, లక్ష్మప్ప, ధారూరు ఎంపీవో షఫీఉల్లా, ధారూరు తహసీల్దార్ భువనేశ్వర్, ఏపీవో సురేశ్కుమార్, నీటిపారుదలశాఖ డీఈ, ఏఈ పాల్గొన్నారు.