సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతోపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశా రు. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మం త్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షలో ఆదేశాల మేరకు ఈ నెల 13న నియోజకవర్గాల్లో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతోపాటు అదేరోజు అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభం, పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న సభను విజయవంతం చేసేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించినట్లు మంత్రి తలసాని తెలిపారు.