ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు కేవలం 1,502 మంది రైతుల నుంచి 9,101 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు రైతుల నుంచి సేకరించారు. కాగా, గతేడాది వానకాలం సీజన్లో కేసీఆర్ సర్కార్ 20,409 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది.
ఈసారి వడ్ల కొనుగోళ్లు జరుగుతాయా.. లేదా? అన్న సందేహంతో రైతులు ముందుగానే దళారులు, వ్యాపారులకు అమ్ముకోవడం, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే సన్న రకానికి బయటి మార్కెట్లో ఎక్కువ ధర లభించడం, దళారులు కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం సేకరించడం వంటివి ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు తగ్గడానికి కారణంగా తెలుస్తున్నది. ఈసారి వానకాలంలో 1,32,169 ఎకరాల్లో వరి సాగవ్వగా.. 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. అనూహ్యంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి.
రంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది వానకాలం సీజన్కు సంబంధించి కొనుగోలు చేసిన ధాన్యంలో సగం మాత్రమే ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేయగలిగింది. అన్ని అనుకూల పరిస్థితుల నేపథ్యంలో వానకాలంలో రైతాంగం పుష్కలంగా పంటలను సాగు చేసింది. ఈ క్రమంలో దిగుబడులు సైతం భారీగానే వచ్చాయి. కానీ.. ధాన్యం మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రాలేదు. దీంతో ఇప్పటివరకు కేవలం 9,101 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇక కేంద్రాలకు ధాన్యం వచ్చే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు సరైన అవగాహన కల్పించక పోవడం.. బయటి మార్కెట్లో దళారులు, వ్యాపారులు పెద్దఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్లనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు తగ్గడానికి కారణంగా తెలుస్తున్నది.
జిల్లాలో నీటిపారుదల పెరిగిన నేపథ్యంలో ఏటేటా సాగు విస్తీర్ణంతోపాటు ధాన్యం దిగుబడులు పెరుగుతూ వస్తున్నాయి. పంటలు అమ్ముకునేందుకు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనేలా చర్యలు తీసుకున్నది. ఈ క్రమంలో.. ఈ ఏడాది వానకాలం ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మూడు కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో, 20 కేంద్రాలను పీఏసీఎస్ల ఆధ్వర్యంలో, మరో 10 కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కొనుగోళ్లు జరిపింది. ఇప్పటివరకు 1,502 మంది రైతుల నుంచి 9,101 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఈ మేరకు రూ.12కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు జరిగాయి. ఈ సీజన్లో 10వేల మెట్రిక్ టన్నుల లోపే ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గత ప్రభుత్వం వానకాలం సీజన్కు సంబంధించి 20,409 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే ధాన్యం కొనుగోళ్లు సగానికి సగం తగ్గాయి.
ఈసారి వానకాలంలో జిల్లాలో 3.35లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఒక్క వరి సాగునే 1,32,169 ఎకరాల్లో చేపట్టారు. ఈ మేరకు దిగుబడులు సైతం బాగానే రావడంతో 87వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కానీ.. వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈసారి వడ్ల కొనుగోళ్లు జరుగుతాయా? లేదా అన్న సంశయంలో రైతులు ముందుగానే దళారులు, వ్యాపారులకు అమ్ముకున్నారు. కళ్లాల వద్దకే వెళ్లి వ్యాపారులు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే సన్న రకానికి బయటి మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో సన్న రకాన్ని వ్యాపారులకు అమ్మి, దొడ్డు రకాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తెచ్చారు. ఈ ప్రభావం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై పడి ధాన్యం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి.