‘కంటి వెలుగు’కు విశేష స్పందన లభిస్తున్నది. ఉచితంగా నాణ్యమైన సేవలు అందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్య సిబ్బంది వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైనవారికి మందులతోపాటు కండ్లద్దాలు అందజేస్తున్నారు. 12వ రోజు సోమవారం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 15,490 మందికి కంటి పరీక్షలు చేయగా, 2,175 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 1869 ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 5,442 మందికి కంటి పరీక్షలు చేయగా, 958 మందికి రీడింగ్ గ్లాసులను అందజేశారు. మరో 698 మంది కోసం ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ను ఆర్డరిచ్చారు.
షాబాద్, ఫిబ్రవరి 6 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,490 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 80 వైద్య బృందాల ద్వారా ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల్లో వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల కోసం వృద్ధులు, మహిళలు తరలి వస్తున్నారు. పరీక్షలు చేసుకున్న వారి వివరాలను సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితో పాటు, ఆయా డివిజన్ల వైద్యాధికారులు ప్రతిరోజు కంటి వెలుగు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,490 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,175 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,869 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నది. ఆయా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
వికారాబాద్ (నమస్తే తెలంగాణ) : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు అందజేస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్ల అద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు శిబిరాలను సందర్శిస్తున్నారు. సోమవారం జిల్లాలో 5442 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 958 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 698 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని నిరుపేదల్లో కంటి వెలుగు ధైర్యం నింపుతున్నది.
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన కంటి వెలుగుతో ప్రజల కంటి సమస్యలు దూరమవు తున్నాయి. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 18 ఏండ్లు దాటి న వారందరూ కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలి.
– మచ్చెందర్, హజిపల్లి, ఫరూఖ్నగర్ మండలం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగుతో మాలాంటి పేదలు వేరే చోటుకి వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. ఇది వరకు నేను ఎక్కడా చూడలేదు. మునుపు కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణాలకు పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. నాకు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు.
– దుడ్డు రాజేశ్వర్, కౌకుంట్ల, చేవెళ్ల మండలం