ఆదిబట్ల, ఏప్రిల్ 21 : ‘పులిందర్ వాగును మట్టితో పూడ్చి.. దర్జాగా రోడ్డేసి..’ అన్న శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు స్పందించారు. మంగళవారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయ పరిధిలోని జిలాన్ఖాన్చెరువు, పులిందర్ వాగును సందర్శించి.. చెరువుతోపాటు పులిందర్వాగు కూడా కబ్జా కు గురైనట్టు నిర్ధారించారు. వాగును పూడ్చి వేసిన రోడ్డును.. అలాగే కబ్జాచేసి చెరువుకు అడ్డంగా వేసిన రేకులను జేసీబీతో తొలగింపజేశారు. జిలాన్ఖాన్చెరువుకు హద్దులను ఏర్పాటు చేశారు. రెండు రోజుల సమయమిస్తే వేసిన రేకులను తొలగిస్తామని వెంచర్ యాజమానులు అధికారులను వేడుకున్నా వినలేదు. మరో రెండు రోజుల్లో పూర్తి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ఆర్ఐ సువర్ణ, సర్వేయర్ సాయికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిలాన్ఖాన్చెరువు, పులిందర్ వాగు కబ్జా కండ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు నామమాత్రంగా జేసీబీ సాయంతో రోడ్డును తవ్వి, రేకులను తీసేసినట్టు యాక్షన్ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. అక్కడికి రెవెన్యూ అధికారులు ఉదయం 9 గంటలకే రాగా.. ఇరిగేషన్ అధికారులు మాత్రం తీరికగా మధ్యాహ్నం 1 గంటకు వచ్చారని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి జిలాన్ఖాన్చెరువు, పులిందర్ వాగును కాపాడాలని ప్రజలు డిమాండ్ చేశారు.