కొత్తూరు, జనవరి 10: విద్యార్థుల విచిత్ర ప్రవర్తనకు కారణం తెలుసుకోవాలని హెడ్మాస్టర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జెడ్పీహెచ్ఎస్లో ఇటీవల విద్యార్థుల ప్రవర్తనలో ఉపాధ్యాయులు మార్పు గమనించారు. పాఠాలు చెబుతుంటే నిద్రపోవడం, ప్రార్థన సమయంలో కింద పడిపోవడం..ఇలాంటి పరిణామాలు గమనించిన హెచ్ఎం అంగూర్నాయక్ వీటివెనుక కారణాన్ని తెలుసుకోవడానికి యత్నించాడు.
అలాంటి విద్యార్థిని గుర్తించి..అతనితో మంచిగా మాట్లాడుతూ, కలిసి భోజనం చేస్తూ వివరాలు సేకరించారు. చాక్లెట్ల విషయం తెలుసుకొని తనకూ అటువంటివి కావాలని తెప్పించుకున్నాడు.. ఏ దుకాణంలో అమ్ముతున్నారో వివరాలు సేకరించి, ఆ షాప్ ఫొటో కూడా తెప్పించుకున్నాడు. ఈ వివరాలన్నింటినీ హెచ్ఎం స్థానిక ప్రజాప్రతినిధులతో చెప్పి, అందరూ కలిసి డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ఎస్వోటీ పోలీసులను రంగంలోకి దించారు.
వారు మంగళవారం కొత్తూరు మున్సిపాలిటీలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 8 కిలోల మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ను ఆనుకొని ఉన్న దుకాణం నుంచే ఈ మత్తు చాక్లెట్లు సరఫరా జరుగుతుందని పోలీసులు తేల్చారు. మొత్తంగా హెచ్ఎం చొరవ కారణంగా ముఠాసభ్యులు అరెస్టుకావడంతో స్థానికుల నుంచి అంగూర్నాయక్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.