ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రత్యేక చొరవతో త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు మన జిల్లాకు అందనున్నాయి. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు ఎట్టకేలకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ఊపందుకోనున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి సాగు, తాగు నీరు అందనున్నది. ఇందుకోసం అవసరమైన పనుల కోసం ప్రభుత్వం రూ.5,180కోట్లను వెచ్చిస్తున్నది. ‘పాలమూరు-రంగారెడ్డి’తో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కానున్నది. మొత్తం 6.18 లక్షల ఎకరాల ఆయాకట్టుకు సాగునీందనున్నది. అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని 1,17,136 ఎకరాలకూ సాగునీరు అందనున్నది. అకుంఠిత దీక్షతో తమ కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నది.
-రంగారెడ్డి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందనున్నది. సాగు, తాగు నీటితో ప్రజలకు మేలు జరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగడం శుభపరిణామం. త్వరలో పలు నియోజకవర్గాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే కేఎల్ఐ, డీఎల్ఐతో కల్వకుర్తి నియోజకవర్గానికి సమృద్ధిగా సాగునీరు అందుతున్నది. సీఎం కేసీఆర్ సారు రైతుల పక్షపాతిగా ఉంటూ సరిపడా సాగునీరు అందిస్తున్నారు. మా రైతుల కోసం ఇంత చేస్తున్న ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-రూపం వెంకట్రెడ్డి, రైతు, చింతలపల్లి, ఆమనగల్లు
– తుమ్మలూరు సభలో సీఎం కేసీఆర్ అన్న మాటలివి.
రంగారెడ్డి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : ‘పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు లైన్ క్లియర్ అయ్యింది. పర్యావరణ అనుమతులకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎత్తిపోతల పనులకు అడ్డంకులు తొలగిపోయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసుల దశాబ్దాల నాటి కల త్వరలోనే తీరనున్నది. ఇన్నాళ్లుగా నెమ్మదించిన పనులు వేగం పుంజుకోనున్నాయి. వాగులు, వంకలు దాటుకుంటూ కరువు నేలపై కృష్ణమ్మ బిరబిరా పారనున్నది. నీటి కోసం తల్లడిల్లుతున్న రైతాంగం కష్టాలను తీర్చడంతోపాటు తాగునీటి పరంగానూ ప్రజానీకాన్ని ఆదుకోనున్నది. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇక కేంద్ర జలశక్తి శాఖ అనుమతి లాంఛనమే కానుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అపూర్వ చరిత్రాత్మక విజయాన్ని అందించిన సీఎం కేసీఆర్ సంకల్పాన్ని వేన్నోళ్లా ప్రజానీకం కొనియాడుతోంది.’
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను రెండు కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తొలుత హెడ్రెగ్యులేటర్కు, అక్కడి నుంచి మూడు సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడి నుంచి ఎనిమిది పంపుల ద్వారా 104 మీటర్ల మేర ఎత్తి అంజనగిరి రిజర్వాయర్లోకి పోస్తారు. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం నుంచి ఏదుల పంప్హౌజ్కు తరలిస్తారు. అక్కడ తొమ్మిది మోటార్ల ద్వారా 124 మీటర్ల మేర ఎత్తిపోస్తారు. ఈ జలాలు వీరాంజనేయ రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఆ తర్వాత రిజర్వాయర్ నుంచి జలాలను కాల్వలు, సొరంగాల ద్వారా నీటిని వట్టెం పంప్హౌజ్కు జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి తొమ్మిది మోటర్ల ద్వారా 121 మీటర్లపైకి ఎత్తి వెంకటాద్రి రిజర్వాయర్లో పోస్తారు. అనంతరం అక్కడి నుంచి 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా జలాలను కురుమూర్తి రిజర్వాయర్కు తరలిస్తారు. అనంతరం కురుమూర్తి రిజర్వాయర్ నుంచి 8.5 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సొరంగాల నుంచి ఉద్దండాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడ ఐదు మోటర్ల ద్వారా 122 మీటర్ల మేర లిఫ్టు చేసి ఉద్దండాపూర్ రిజర్వాయర్లో పోస్తారు. ఇలా… సముద్రమట్టానికి 345 మీటర్ల ఎత్తులో ఉన్న కృష్ణా జలాలను వివిధ దశల్లో ఎత్తిపోస్తూ.. పలు రిజర్వాయర్లలో నిల్వ చేస్తూ… చివరకు 629 మీటర్ల ఎత్తులో ఉన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కు తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 15.91 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ నుంచే బీడు భూముల్లోకి భారీ ఎత్తున కృష్ణా జలాలు పారనున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు) పరిధిలోని 6.18 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందనున్నది.
‘పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. మొదటి విడుతలో తాగునీటికి సంబంధించిన పనులను, రెండో విడుతలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఎత్తిపోతలకు సంబంధించిన అనుమతులు, పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రిబ్యునల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు అడుగడుగునా పిటిషన్లు వేసి ఎత్తిపోతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో చేసిన పోరాటంతో తాగునీటి అవసరాల కోసం అవసరమైన పనులను చేపట్టేందుకు సుప్రీంకోర్టు నుంచి అనుమతులను పొందింది. ఈ మేరకు నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్హౌజ్లు, ఓపెన్ కెనాల్స్, సొరంగ మార్గాలు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కంట్రోల్ యూనిట్లు వంటి పనులను వేగవంతంగా చేపట్టింది. ఆగస్టు చివరి నాటికి అన్ని పనులను పూర్తి చేసుకుని ఉద్దండాపూర్ జలాశయం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, కొడంగల్, పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలను నింపే దిశగా నీటిపారుదల శాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ఈఏసీ కేంద్రానికి సిఫారసు చేయడం రెండో దశలో చేపట్టబోయే సాగునీటి పనులకు మార్గం సుగుమమైంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచే సాగు, తాగు నీటిని అందించేలా ప్రభుత్వం డిజైన్ చేస్తున్నది. ఇందుకు సంబంధించి రూ.5,180 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఉద్దండాపూర్ నుంచి నిర్మించే మెయిన్ కెనాల్ 16.5 కిలోమీటర్ల వద్ద కుడి, ఎడమ కాల్వలను నిర్మించి సాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎడమ కాల్వ నుంచి వికారాబాద్ జిల్లా వైపుగా.. కుడి కాల్వ నుంచి రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాలతో పాటు నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు వరకు నీరందించనున్నారు. మధ్య మధ్యలో కొన్ని ఊర్లకు నీరందించేందుకుగాను చిన్నపాటి లిఫ్ట్లను ఏర్పాటు చేయనున్నారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షవల్లే ఇది సాధ్యమైందని కొనియాడుతున్నారు. రైతాంగం సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నది.
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించేందుకు డిజైన్ రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టులో భాగంగా 23, 24, 25, 26 ప్యాకేజీల కింద చేపట్టే పనులకు రూ.4200 కోట్లతో టెండర్లు కూడా పూర్తి చేశారు. కానీ తెలంగాణ ఏర్పడే వరకు నాలుగు ప్యాకేజీల కింద రూ.194 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయితే వాస్తవంగా ప్రాణహిత-చేవెళ్ల ద్వారా జిల్లాకు సాగునీరు అందడం అసాధ్యమని సీఎం కేసీఆర్ రీడిజైనింగ్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. రంగారెడ్డి జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకుగాను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. అందులో ఏకంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 6.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వేగంగా పనులు నిర్వహిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏ ఒక్క గ్రామీణ నియోజకవర్గాన్నీ వదలకుండా తాగు, సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్, పరిగితో పాటు నాగర్కర్నూలు-వికారాబాద్ పరిధిలో ఉండే కొడంగల్ నియోజకవర్గంలోనూ 1,17,136 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనున్నది. ప్రధానంగా ఈ ప్రాజెక్టులో సుమారు 1250కి పైగా చెరువులకు కృష్ణాజలాలు అందించనుండగా.. వీటిల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 1100 వరకు చెరువులు ఉండటం విశేషం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం దాదాపు 70 టీఎంసీల వరకు ఉండటంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మాదిరిగానే మండు వేసవిలోనూ ఈ చెరువులకు కృష్ణా జలాలను అందించేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 11 : పాలమూరు ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం హర్షణీయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ గ్రామంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్తో పాటు పలు జిల్లాలకు ఈ ప్రాజెక్టుతో పుష్కలంగా సాగు నీరు అందనున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, నాయకులు సత్తయ్య, మహేశ్గౌడ్, జగదీశ్యాదవ్, మండల అధ్యక్షుడు బుగ్గరాములు, రమేశ్గౌడ్, రమేశ్, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, నాయకులు జెర్కోని రాజు, కర్నె అరవింద్, మంద సురేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు రావడం సంతోషంగా ఉన్నది. వికారాబాద్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు అందనున్నది. దీంతో పాటు ప్రజలకు తాగు నీటిని అందించేందుకు కృషి చేయనున్నారు. ఏడాదిలోపు పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయనున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి జిల్లాకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు.
– డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే వికారాబాద్
తాండూరు, ఆగస్టు 11 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడం మరో అపూర్వ చారిత్రక విజయమని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకం అనుమతులకు సీఎం కేసీఆర్ చేసిన కృషి అమోగమన్నారు. ఈ పథకంతో తాండూరు నియోజకవర్గంలోని లక్ష 30 వేల ఎకరాలకు సాగు నీరు వస్తుందన్నారు. తట్టెపల్లి సమీపంలో 11 టీఎంసీ రిజర్వాయర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీం, నేతలు ఉమాశంకర్, నర్సింహులు, శ్రీనివాస్చారి, రాంలింగారెడ్డి పాల్గొన్నారు.
ఆమనగల్లు, ఆగస్టు 11 ః పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయిని అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లో 12.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ. 35 వేల కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కల్వకుర్తి నియోజకవర్గంలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కల్వకుర్తికి కేఎల్ఐ ద్వారా లక్ష ఎకరాలు, డీఎల్ఐ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీంతో కల్వకుర్తి నియోజకవర్గం సస్యశామలం కానున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కొడంగల్, ఆగస్టు 11ః పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం హర్షణీయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో నియోజకవర్గానికి లక్షా 49 వేల ఎకరాలను సాగునీరు అందనున్నదన్నారు. నీటి నిల్వల దిశగా నియోజకవర్గంలోని ఆయా మండల ప్రాంతాల్లో ఇదివరకే 6 చెక్డ్యాంల నిర్మాణం చేపట్టడం జరిగిందని, మరో 12 చెక్డ్యాంల నిర్మాణానికి గాను రూ.25కోట్లు మంజూరైనట్లు తెలిపారు. చెక్డ్యాంల వల్ల రెండు మూడు సంవత్సరాలు వర్షాలు కువరకున్నా భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూధన్రావు యాదవ్, బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దామోదర్రెడ్డి, పట్టణ అద్యక్షులు రమేష్బాబు, మాజీ జెడ్పీ వైస్ చైర్మణ్ కృష్ణ, సర్పంచ్లు సయ్యద్ అంజద్, గోవింద్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మణ్ భీములతో పాటు బీఆర్ఎస్ నాయకులు దాసప్ప యాదవ్, వెంకటయ్యగౌడ్, బిచ్చిరెడ్డి, నవాజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి, ఆగస్టు 11 : పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పరిగిలో బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్దండాపూర్ ప్రాజెక్టు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిగి నియోజకవర్గానికి మొదట నీరు వస్తుందన్నారు. పరిగి నియోజకవర్గానికి సంబంధించిన కాలువ నిర్మాణానికి రూ.1442కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, చెరువుల వల్ల మరో 50వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. పర్యావరణ అనుమతులు సాధించిన సందర్భంగా సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్ పాల్గొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులతో రైతుల కల సాకారం కానుంది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి కృషితోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతులను సాధించింది. అతి త్వరలోనే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి రైతులకు నీళ్లు అందనున్నాయి. ప్రాజెక్టు అడ్డుకోవడం కోసం ఎవరూ ఎన్ని కుట్రలు చేసిన చివరకు న్యాయమే గెలుస్తుందని ఈ అనుమతులతో రుజువైంది. పొలాలకు నీళ్లుపారే మంచిరోజులు మన కండ్లముందే ఉన్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కానున్నది. షాద్నగర్ నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-వై.అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్నగర్
చేవెళ్లటౌన్, ఆగస్టు 11: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి సాధించడం ఒక గొప్ప విజయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నదన్నారు. నాగర్కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపించడం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో వరద నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యమన్నారు. సముద్ర మట్టం నుంచి 269.735 మీ. ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీ. ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారన్నారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిప్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం చరిత్రాత్మక విజయమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి జిల్లా, వైస్ చైర్మన్ నర్సింలు, డైరెక్టర్లు కృష్ణ, మహేశ్, సర్పంచ్లు మల్లారెడ్డి, నరహరిరెడ్డి, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, నాగార్జునరెడ్డి, దండు సత్తి, నాయకులు రాఘవేందర్రెడ్డి, నరేందర్ గౌడ్, ఎల్లయ్య, ఘని, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
మొయినాబాద్, ఆగస్టు11 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, పంటలతో జిల్లా పచ్చగా మారనున్నదని, రైతులు భూమలను అమ్ముకోవద్దని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చిన సందర్భంగా బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. చేవెళ్ల ప్రాంతం హైదరాబాద్ మహానగరానికి ఆనుకుని ఉండడంతో ఈ ప్రాంతం మరో నూతన హైదరాబాద్ నగరంగా అభివృద్ధి చెందబోతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం జయవంత్, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రావూఫ్, డైరెక్టర్లు రాజుగౌడ్, భిక్షపతిగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, నాయకులు సురేందర్గౌడ్, రాఘవేందర్యాదవ్, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.