షాబాద్,మార్చి 19 : ప్రస్తుతం వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఇలాంటి సమయంలో బోరుబావుల వద్ద నీటి వసతి ఉన్నవారు తమకున్న భూమిలో కొంత భాగాన్ని పచ్చిమేతల సాగుకు కేటాయించడం ఎంతైన అవసరమని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. పశుగ్రాసం రుచికరంగా ఉండాలి. పశువులకు ఏ మాత్రం హానీ కలుగకుండా సులభంగా జీర్ణమయ్యేలా ఉండే బాగుంటుంది. తక్కువ ఎరువుతో తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు వచ్చేలా చూసుకోవాలి. సరైన యాజమాన్య చర్యలు చేపట్టినైట్లెతే పశుగ్రాసంలో మంచి దిగుబడులు వస్తాయని పశువైద్యాధికారులు రైతులకు సూచిస్తున్నారు.
ఇవి జొన్న జాతికి చెందినవి. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ, నాగరకుంట, నరెడ్లగూడ, అస్పల్లిగూడ, అంతారం, కేశారం తదితర గ్రామాల్లో ధాన్యపు జాతి పశుగ్రాసం అత్యధికంగా పెంచుతున్నారు. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఏడాదిలోనే ఈ పంట కాలం పూర్తవుతుంది. నేపియర్, ఎన్బీ-21,కో-1,3,పారా గడ్డి, గినీగడ్డి అనేవి బహువార్షికాలు. అంటే ఒకసారి నాటితే మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తున్నది. కాయజాతి పచ్చిమేతలు పశువులకు మంచి బలాన్ని ఇస్తాయి. కాయజాతి పచ్చిమేతల్లో అలసంద, లూసర్న్, బర్సీమ్, జనుము అనేవి బహువార్షిక కాయజాతి పశుగ్రాసం. రైతులు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుని తమకు అనువైన పచ్చిమేతల్ని సాగు చేసుకోవాలి. పశుగ్రాసాలు ఏడాది పొడవునా ఒకేలా పెరగవు. కానీ పశువులకు ఏడాది పొడవునా పశుగ్రాసం అవసరం ఒకేలా ఉంటుంది. కాబట్టి సాగు చేసిన పశుగ్రాసాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవాలి.
వరిగడ్డిని నిల్వ చేయాలంటే ముందుగా 60 లీటర్ల నీటిలో నాలుగు కిలోల యూరియాను కరిగించాలి. వంద కిలోల వరిగడ్డిని నేలమీద పరిచి దానిపై యూరియా ద్రావణాన్ని చల్లి బాగా కలిసేలా చూడాలి. ఈ విధంగా సుపోషకం చేసిన తరువాత ఖాళీ సంచుల్లో గట్టిగా నింపాలి. గాలి చొరబడకుండా కుట్టి వారం రోజుల పాటు మాగనివ్వాలి. ఆ తరువాత దానిని పశువులకు తినిపించాలి. దీంతో తేమ శాతం పెరిగి గడ్డి రుచిగా, మెత్తగా ఉంటుంది. పశువులు ఇష్టంగా తింటాయి. ఒక రోజులో పశువుకు ఆరు కిలోల వరకు మాగేసిన గడ్డిని అందించవచ్చు. పశుగ్రాసం వృథా కాకుండా ఉండాలంటే దానిని ఛాప్ కట్టర్తో చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు తినిపించాలి.
వేసవిలో పశువులకు బయట మేత దొరకడం కష్టంగా మారుతుంది. అందుకోసం రైతులు పశుగ్రాసాన్ని పొదుపుగా వాడుకోవాలి. బోరుబావుల వద్ద నీటి సదుపాయం ఉన్న రైతులు పచ్చిమేతను సాగు చేసుకోవాలి. మిగతా రైతులు వరిగడ్డిని నిల్వ ఉంచుకుని మక్కిన తర్వాత పశువులకు మేతకు ఉపయోగించాలి. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు రైతులకు ఎప్పకప్పుడూ అందజేస్తున్నాము. 75 శాతం సబ్సిడీపై ప్రభుత్వం విత్తనాలను కూడా అందిస్తున్నది.
– డాక్టర్ స్రవంతి, పశువైద్యాధికారి షాబాద్