షాబాద్, జనవరి 8 : ఏ ఒక్క విద్యార్థి కూడా బడిబయట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకోసం సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రతిఏటా సర్వే నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో 81 మంది సీఆర్పీల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇంటింటి సర్వే ముమ్మరంగా సాగుతున్నది.
డీఈవో ఆదేశాల మేరకు సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో ప్రబంధ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. డిసెంబర్ 10న ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 10 వరకు కొనసాగనున్నది. సర్వే జరుగుతున్న తీరును ప్రతిరోజూ సెక్టోరల్ అధికారులు పర్యవేక్షించడంతోపాటు వారి నుంచి డీఈవో వివరాలను సేకరిస్తున్నారు.
జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి), శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 1,062 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందుకోసం 81 మంది సీఆర్పీలు అర్బన్, రూరల్ ప్రాంతాలవారీగా సర్వే చేపడుతున్నారు. సర్వేలో 6-14 ఏండ్లు, 15-19 ఏండ్లలోపు బడిబయట ఉన్న బాలబాలికలను గుర్తిస్తున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అసలు బడిలో చేరకుండా, బడిలో చేరి కూడా 30 రోజులకు పైగా గైర్హాజరవుతున్న బాలబాలికలను గుర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 300 మంది లాంగ్ డ్రాపౌట్స్ అయినట్లు గుర్తించారు. వారిని తిరిగి పాఠశాలలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నెల రోజులుగా జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో సీఆర్పీలు ఇంటింటి సర్వేను ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందుకోసం వారు ఇంటింటికెళ్లి అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. సదరు బాలబాలికలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీల్లో అర్హతను అక్కడ చేర్పిస్తున్నారు.
జిల్లాలో బడిబయట ఉన్న పిల్లల వివరాలను సేకరించేందుకు 81 మంది సీఆర్పీలతో సర్వే చేయిస్తున్నాం. సర్వే ముగిసే నాటికి గుర్తించిన పిల్లలను పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 300 మందిని గుర్తించాం. ఈ నెల 10తో సర్వే ముగుస్తుంది. వందశాతం లక్ష్యం సాధించే దిశలో ముందుకెళ్తున్నాం.
– సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో