షాద్నగర్టౌన్, ఫిబ్రవరి 2: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని, బస్తీ దవాఖానతో తక్షణ వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 26వ వార్డు ఇంద్రానగర్కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన(పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ను గురువారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీ దవాఖాన ఏర్పాటుతో పేద ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయన్నారు. బస్తీ దవాఖానను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, నాయకులు జూపల్లి శంకర్, శేఖర్, రాధాకృష్ణ, నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మహనీయుల బాటలో నడవాలి
షాద్నగర్ : మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశమే దిక్సూచిగా ఉండేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అదే విధంగా బడుగు బలహీన వర్గాలను విద్యావంతులను చేసేందుకు మహాత్మా జ్యోతిరావుఫూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ విడుదల
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని రామేశ్వరంలో గల ఉత్తరరామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆవిష్కరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, రామేశ్వరం సర్పంచ్ సంపత్కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామశర్మ ఉన్నారు.