బొంరాస్పేట, సెప్టెంబర్ 21 : అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబా ద్ జిల్లాలో 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ అవుతా యి. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సీఎం కేసీఆర్ వ రాల జల్లు కురిపించారు. పదవీ విరమణ వేళ ఆర్థిక సహాయం, ప్రమాద బీమా, ఆసరా పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో 300కుపైగా జనాభా, అర్బన్ ప్రాంతాల్లో 400కుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ కానున్నాయి. పదేండ్లుగా కొనసాగుతున్న మినీ అంగన్వాడీ కేంద్రాలు పెరిగిన జనాభా ప్రాతిపదికన ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చింది. వికారాబాద్ జిల్లా లో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మర్పల్లిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మినీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ అయ్యాయి. కొడంగల్ ప్రాజెక్టు పరిధిలో 8, మర్పల్లిలో 17, పరిగిలో 74, తాండూరులో 20, వికారాబాద్ ప్రాజెక్టు పరిధిలో 19 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
అప్గ్రేడ్తో పెరుగనున్న హెల్పర్ల పోస్టులు
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే ఉంటారు. హెల్పర్ ఉండరు. దీంతో అన్ని పనులు టీచరే చేయాల్సి వస్తుంది. మెయి న్ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయితే ప్రభుత్వం వీటికి హెల్పర్ పోస్టులను మంజూరు చేసి నియమిస్తుంది. దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ప్రధాన కేంద్రాల్లో పనిచేసే టీచర్కు నెలకు వేతనం రూ.13,650 ఉండగా, మినీ కేంద్రంలోని టీచర్కు రూ.7800 మాత్రమే. అప్గ్రేడ్తో మినీ కేంద్రాల టీచర్ల వేతనం కూడా పెరిగి వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్రధాన కేంద్రాలుగా మారనున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఇంటర్ విద్యార్హత ఉన్న వారు టీచర్లుగా కొనసాగుతారు. ఇంటర్ అర్హత లేని వారు హెల్పర్లుగా కొనసాగుతారు. పదేండ్ల క్రితం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ జనాభా ఉండడం, రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో నాటి ప్రభుత్వం ఆయా ప్రాంతంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
అంగన్వాడీలకు వరాలు
అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని ప్రకటించారు. పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచడంతో పాటు విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. సర్వీసులో ఉన్న టీచర్ దరదృష్టవశాత్తూ మరణిస్తే తక్షణ సహాయంగా రూ.20 వేలు, సహాయకురాలికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందనుంది. అలాగే 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, వయసు మీరిన వారికి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తామని చెప్పారు.