సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంతో వికారాబాద్ జిల్లాలోని 262 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, సౌర విద్యుత్తు ఉత్పత్తికిగాను ప్రభుత్వం రూ.11.25 కోట్లను కేటాయించింది.
ఈ మేరకు ఎంపికైన పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేయగా, టీఎస్ రెడ్కో పాఠశాలలకు సౌర పలకలను బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాల బోధన, ఫ్యాన్లు, కంప్యూటర్లు, లైట్లు వంటి వాటితో ప్రతినెలా వేల రూపాయల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుతో పాఠశాలలకు విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గనున్నది.
– బొంరాస్పేట, డిసెంబర్ 29
బొంరాస్పేట, డిసెంబర్ 29 : సౌర శక్తిని సద్వినియోగం చేసుకుంటే విద్యుత్ ఖర్చులు బాగా తగ్గుతాయి. అందుకే ప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లుల భారం అంతకంతకూ పెరుగుతున్నాయి. పాఠశాలలకు వచ్చే గ్రాంట్లు తక్కువగా ఉండడంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేక హెచ్ఎంలు సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మారిన సౌర విద్యుత్ను పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నాబార్డ్ ఆర్థిక సహకారంతో తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ రెడ్కో) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలో రూ.11.25 కోట్లతో 262 ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల జాబితాతో ఉత్తర్వులు జారీ చేయగా త్వరలోనే పనులు చేపట్టనున్నారు.
సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాల బోధన, ఫ్యాన్లు, కంప్యూటర్లు, లైట్లు వంటి వాటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రతినెలా వేల రూపాయల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. పాఠశాలలకు వచ్చే గ్రాంట్లు చాలా తక్కువగా ఉండడంతో కరెంటు బిల్లులను చెల్లించలేక హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. సౌర విద్యుత్ కేటాయింపుతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని హెచ్ఎంలు అభిప్రాయపడుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో 1030 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 262 పాఠశాలలను సౌర విద్యుత్ కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. విద్యుత్ పలకల ఏర్పాటుకు సర్కారు రూ.11.25 కోట్లను కేటాయించింది. టీఎస్ రెడ్కో పాఠశాలలకు సౌర పలకలను బిగిస్తున్నది.
పాఠశాలలోని విద్యార్థులు, తరగతి గదుల సంఖ్య, పాఠశాల అవసరాలను గుర్తించిన అధికారులు అందుకు అనుగుణంగా సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు కనిష్ఠంగా రెండు కిలోవాట్లు, గరిష్ఠంగా 10కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కిలోవాట్కు రూ.లక్ష చొప్పున గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులను ఖర్చు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు రెండు కిలోవాట్లు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోవాట్లు, వసతి సౌకర్యం, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు పది కిలోవాట్ల సామర్థ్యంతో జిల్లాలో 1125 కిలోవాట్ల సౌర విద్యుత్ తయారీకి సరిపడా యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ యూనిట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మొదట మన ఊరు-మనబడి పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నాం. వీటి ఏర్పాటుతో పాఠశాలలకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండడం వల్ల డిజిటల్ పాఠాల బోధనకు, ఆన్లైన్ నమోదు వంటి పనులకు అంతరాయం ఉండదు.
– రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్