కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకుగాను రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అక్టోబర్ 1, 2023 వరకు 18 ఏండ్లు పూర్తయ్యేవారు డిసెంబర్ 9వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అర్హులైనవారు ceotelangana.in, http://nvsp.in వెబ్సైట్ల ద్వారా లేదా మండల కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నమోదైన ఓటర్లు మార్పు చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు.
కొత్తవారు ఫారం-6లో వివరాలు నింపాలి. దరఖాస్తుకు పదో తరగతి మార్కుల మెమోతోపాటు అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఫారం-6కు సంబంధించి ఇప్పటివరకు 2,304 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా తాండూరు నియోజకవర్గం నుంచి 870 దరఖాస్తులు ఉన్నాయి. అయితే జనవరి 5న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 1130 పోలింగ్ కేంద్రాలుండగా 8,71,746 మంది ఓటర్లున్నారు.
-వికారాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరుగా నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 9 వరకు గడువు ఇచ్చింది. ఎవరైతే జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1, 2023 వరకు 18 ఏండ్లు నిండినవారై ఉంటే వచ్చే నెల 9లోగా ఓటరుగా ceotelangana.in, http://nvsp.in వెబ్సైట్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకొని తప్పులను సరిచేయించుకోవచ్చు. మీ సేవ ద్వారా కూడా ఓటరు గుర్తింపు కార్డుకై దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్తోపాటు ఫారం-6లో వివరాలను రాసి సంబంధిత మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలోగాని, బూత్స్థాయి అధికారులకుగాని అందజేయొచ్చు. ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు పదో తరగతి మార్కుల మెమో లేదా అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. మరణించిన లేదా శాశ్వతంగా నివాసం మార్చిన వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించుటకు ఫారం-7 పూరించి దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఓటరు జాబితాలో మీ పేరు సవరించుకునేందుకు ఫారం-8లో మీ ఈపీఐసీ నంబర్ను పేర్కొంటూ క్లెయిమ్ పత్రాన్ని దాఖలు చేయాలి. మీరు ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం మార్చుకున్నట్లయితే ఫారం-8ఏలో పాత చిరునామాతోపాటు ప్రస్తుత చిరునామాను పేర్కొంటూ సవరణ పత్రాన్ని ఆన్లైన్తోపాటు నేరుగా సంబంధిత బీఎల్వోలకు అందజేయవచ్చు. మీరు మీ నివాసాన్ని కొత్త నియోజకవర్గంలోకి మార్చుకున్నట్లయితే మళ్లీ తాజాగా ఫారం-6 దాఖలు చేసి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త ఓటర్లుగా 2304 దరఖాస్తులు
జిల్లాలో కొత్తగా ఓటరు నమోదుకు సంబంధించి అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆన్లైన్తోపాటు నేరుగా బీఎల్వోలకు ఓటరు దరఖాస్తులను అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కొత్త ఓటరు దరఖాస్తుల(ఫారం-6)కు సంబంధించి 2304 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా తాండూరు నియోజకవర్గం నుంచి 870 దరఖాస్తులురాగా, పరిగి-537, వికారాబాద్-474, కొడంగల్ నియోజకవర్గం నుంచి 423 దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అందినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 9 వరకు కొత్తగా ఓటరు నమోదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు విధించింది.
తదనంతరం కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారులు చేపట్టనున్నారు. మరోవైపు ఓటరు తుది జాబితాను జనవరి 5న ప్రచురించనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1130 పోలింగ్ కేంద్రాలుండగా 8,71,746 మంది ఓటర్లున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,71,746 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు-4,37,274., మహిళలు-4,34,447., ఇతరులు-25 మంది ఉన్నారు.
ఓటరుగా దరఖాస్తు చేసుకోండి -కలెక్టర్ నిఖిల
జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1, 2023 వరకు 18 ఏండ్లు నిండినవారు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 26, 27 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి బూత్ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు.