వికారాబాద్ : వినాయక చవితి పండుగను ప్రజలందరూ శాంతియుతంగా జరుపుకోవాలని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని 50 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో గంగారం, మధుకాలనీ, ఇంద్రానగర్, ఎన్టీఆర్ చౌరస్తా, బీజేఆర్ చౌరస్తాల మీదుగా ఆలంపల్లి వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ జరుగబోయే వినాయక చవితి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ బలగాలు వినాయ నిమజ్జనం జరిగేంత వరకు వికారాబాద్ పట్టణంలో ఉంటారన్నారు. వినాయక నిమజ్జనానికి నిర్వహించే శోభయాత్రలో గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో వికారాబాద్ సీఐ రాజశేఖర్, ఎస్సై లక్ష్మయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.