ఇబ్రహీంపట్నం, జనవరి 10 : రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని పలువురు వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. నేడు రైతులు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులపై దృష్టి సారించడంతో మానవులతో పాటు మూగజీవాలు కూడా ఈ ఆహారాన్ని తిని అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేస్తున్నారు.
రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనల మేరకు రసాయన ఎరువులను పూర్తిగా మరిచిపోయి సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారిస్తే ఎంతో మేలు కలుగుతుందని పలువురు అధికారులు సూచిస్తున్నారు. నేడు విచ్చలవిడిగా వెలసిన ప్రైవేట్ రసాయన ఎరువుల దుకాణాల యజమానులను ఆశ్రయించి రైతులు వారు ఇచ్చిన మందులను ఇష్టానుసారంగా పిచికారీ చేస్తున్నారు. దీంతో భూసారం తగ్గే ప్రమాదం పొంచి ఉండడంతో రైతులందరూ సేంద్రియ ఎరువులను అధికంగా వాడాలని సూచిస్తున్నారు.
రసాయన ఎరువుల వాడకంతో వాటి అవశేషాలు బియ్యపు గింజల్లో దాగి ఉంటున్నాయి. వాటిని తినడంతో కిడ్నీ, జీర్ణ వ్యవస్థలపై ప్రభావం పడుతున్నది. పొలం ఒడ్డు వరాలపై పెరిగిన పచ్చగడ్డి కూడా విషపూరితమవుతుండడంతో ఆ గడ్డిని మేయడంతో మూగజీవాలు కూడా అనారోగ్యానికి గురవుతున్నాయి. పంటల సాగులో వివిధ రకాల చీడపీడలను నివారించేందుకు మోనోక్రోజోఫాస్, ట్రైకోడెర్మా విరిడే, ట్రైక్లోరోపాస్ తదితర అతి ప్రమాదకరమైన పురుగు మందులను వాడడంతో భూసారం పూర్తిగా తగ్గిపోతుంది. రైతులు పంట కోసిన వెంటనే దుక్కులు దున్ని సేంద్రియ ఎరువులను వేయాలి.
తిరిగి దుక్కులు దున్నించడం ద్వారా అనంతరం వేసే పంటలకు మంచి దిగుబడి వచ్చే అవకాశమున్నది. నేడు రైతులు పంటలు సాగుచేసిన తర్వాత పంటలకు సోకిన చీడపీడలను నివారించేందుకు ఇష్టానుసారంగా రసాయన ఎరువులు వాడడంతో భూములు కోతకు గురవుతున్నాయి. ఆయా ప్రాంతాల రైతులకు ఈ విషయమై పూర్తిగా అవగాహన లేకపోవడంతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. రసాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. రసాయన ఎరువుల స్థానంలో వర్మీ కంపోస్టు, ఆవుపేడ, కోడి ఎరువుతో పాటు ఇతర సేంద్రియ ఎరువులతో పాటు కషాయాలను వినియోగించాలని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు.