ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని పలుకరించినా.. ఏ నలుగురు గుమికూడినా ఎగ్జిట్ పోల్స్, రానున్న ఫలితాలపైనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అభ్యర్థులు తమ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల ఆధారంగా ఎవరికీ వారే అంచనాలు వేసుకుంటున్నారు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎవరికీ స్పష్టమైన ఆధిక్యతను ఇవ్వకపోవడంతో ఫలితాలపై ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొన్నది. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉండగా.. మరి కొన్నింటిలో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నారు. కాగా, ఈ ఉత్కంఠకు రేపు తెరపడనున్నది.
– రంగారెడ్డి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కీలకమైన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. ఎవరిని పలుకరించినా.. ఎ క్కడ ఇద్దరు గుమికూడినా ఎవరు గెలుస్తారనే చర్చనే జరుగుతున్నది. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. విజయావకాశాలపై ఎవరికీ వారు అంచనాల్లో నిమగ్నమయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 209 మంది అభ్యర్థులు ఎ న్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల లెక్కలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని ఎవరికి వారు బయటకు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల మాత్రం ఒకింత భయం పార్టీలను వెంటాడుతున్నది.
కొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉండ గా.. మరికొన్నింటిలో త్రిముఖ పోటీ నెలకొన్నది. త్రిముఖ పోరులో ఎవరు? ఎవరి విజయవకాశాలను దెబ్బతీస్తారనే విషయంలో పార్టీల అభ్యర్థులు అంతర్మథనం చెందుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లను, ఈ ఎన్నిక ల్లో వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని లెక్కలేసుకుంటున్నారు. తగ్గిన ఓట్లు ఎవరికి చేటు తె స్తుందోన్న భయం సైతం అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తున్నది.
చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ.. పోలింగ్ గడువు ముగిసే సమయానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. దీంతో సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో వేచి ఉన్నవారికి అధికారులు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో అక్కడక్కడా రాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. చివరి నిమిషంలో పెరిగిన పోలింగ్ సైతం ఎవరికి లాభం చేకూరుతుందో! అన్ని విషయాల్లోనూ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఓటరు నాడిపై సైతం తమ అనుయాయులతో ఆరా తీస్తున్నారు.
సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గందరగోళానికి తెరలేపాయి. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యతను ఇవ్వకపోవడంతో సర్వేలపై స్పష్టత కొరవడింది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని చెబితే.. మరికొన్ని సంస్థలు హంగ్ వస్తుందని ప్రకటించి అటు నేతలను, ఇటు ప్రజలను సందిగ్ధంలో పడేశాయి.
కచ్చితత్వంలోని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిగణలోకి తీసుకోలేమని ప్రజానీకం పేర్కొంటున్నది. ఇందుకు 2018 నాటి ఎగ్జిట్ పోల్స్ను ఉదాహరణకు చెబుతున్నారు. అప్పట్లో సర్వే సంస్థలు జనం నాడిని పట్టుకోవడంలో విఫలం కావడంతో బీఆర్ఎస్ గెలుపును అంచనాలు వేయలేకపోయాయని, ఈసారి కూడా ఎగ్జిట్పోల్స్ ఫలితాల మధ్య పొంతన లేకపోవడంతో వాటిని నమ్మాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు.