సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యానికి గండికొడుతున్న విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. సైబర్ సిటీ సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సెక్షన్లో విద్యుత్ ఉద్యోగులు అనధికారికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే సర్కిల్ పరిధిలో వారం రోజుల కిత్రం విద్యుత్ సరఫరా విషయంలోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించిన డీఈ స్థాయిని అధికారిపై బదిలీ వేటు వేశారు.
అల్లాపూర్ సెక్షన్లోని అయ్యప్ప సొసైటీ సబ్స్టేషన్ పరిధిలో సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో అనధికారికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి విద్యుత్ తీగల మార్పిడి పనులు చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) క్రమశిక్షణా చర్యలకు ఆదేశించడంతో సర్కిల్ అధికారులు విచారణ చేసి ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.