కొడంగల్, జనవరి 25 : కొడంగల్ మున్సిపల్ అభివృద్ధికి రూ. 300 కోట్లతో రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను గురువారం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డిలతో కలిసి మున్సిపల్ కమిషనర్ ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కడా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో రానున్న ఐదేండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు రూ.300 కోట్లతో రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను అందించారని.. ఆ నివేదికను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఆ నివేదికలో మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన తాగునీరు, విద్యుత్తు, బీటీ, సీసీ రోడ్లు, పార్కులు, స్కూళ్లు, అంగన్వాడీలు, వైకుంఠధామం, బస్తీ దవాఖాన, పబ్లిక్ కమ్యూనిటీ మరుగుదొడ్లు, పట్టణ సుందరీకరణతోపాటు కొడంగల్లో వ్యవసాయ, స్కిల్ డెవలప్మెంట్, ఆయుష్, మహిళా డిగ్రీ కళాశాలలు, మిల్లెట్ రిసెర్చ్, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, బస్టాండ్ అధునీకరణ, ఫారెస్ట్ పార్కు, పాత భవనాల కూల్చివేత వంటి అంశాలున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ఆయా శాఖల వారీగా అభివృద్ధి ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్న పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీవేంకటేశ్వరాలయాభివృద్ధికి సంబంధించి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక ఏర్పాటు కానున్నదన్నారు. సౌకర్యాల మేరకు అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉషారాణి, కౌన్సిలర్లు రమేశ్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.