రంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైన సీఎం కేసీఆర్ అల్పాహార పథకం విజయవంతంగా సాగుతున్నది. అక్టోబ ర్ 6న మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అదే రోజు జిల్లాలోని మిగతా ఏడు నియోజకవర్గాల్లోని ఒక్కొక్క పాఠశాలలో అల్పాహారాన్ని ప్రారంభించారు. దశలవారీగా ఈ పథకాన్ని విస్తరిస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం జిల్లాలోని 47 పాఠశాలల్లో సక్సెస్ ఫుల్గా అమలు చేస్తున్నది. ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తుండడంతో ఆయా బడుల్లోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ అల్పాహార పథకం రంగారెడ్డి జిల్లాలోని 1,309 బడుల్లో అమలులోకి వస్తే 1,43,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. జిల్లాలో 881 ప్రాథమిక పాఠశాలల్లో 63వేల మంది, 181 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15,500 మంది, 248 హైస్కూల్స్లో 65వేల మంది విద్యార్థులు చదువుతు న్నారు. అక్టోబర్ 6 నుంచి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్ నగర్, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో ఈ అల్పాహార పథకం అమలవుతున్నది.
దసరా తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కాగా ఈనెల 26 నుంచి మరో 39 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 31 పాఠశాలల్లో, మహేశ్వరం నియోజకవర్గంలో 8 పాఠశాలల్లో కొత్తగా ఈ పథకం అమలవుతున్నది. ప్రస్తుతం జిల్లాలోని 31 ప్రాథమిక పాఠశాలలు, 11 జడ్పీహెచ్ఎస్లు, రెండు ఎంపీపీఎస్లు, ఒక్కొక్కటి చొప్పున ఎంపీయూపీఎస్, యూపీఎస్, జీయూపీఎస్లలో ఈ పథకం దిగ్విజయంగా సాగుతున్నది.
విద్యార్థులు ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చి పాఠాలు వినొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలోనే రాగిజావ, కోడిగుడ్డు, అరటి పండుతోపాటు సన్నబియ్యం తో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. సీఎం కేసీఆర్ అల్పాహారంతో మరింత పౌష్టికాహారాన్ని అందించొచ్చనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇది విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడనుండడంతోపాటు బడిపిల్లల హాజరు శాతం పెరిగి డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గనున్నది. మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.