ఊరూరా ‘కంటి వెలుగు’ సందడి కొనసాగుతున్నది. ఉచితంగా నాణ్యమైన సేవలు అందుతుండడంతో ప్రజల విశేష స్పందన లభిస్తున్నది. ఉదయాన్నే శిబిరాలకు చేరుకొని క్యూలో ఉండి మరీ కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అవసరమైనవారికి మందులతోపాటు కండ్లద్దాలు అందజేస్తున్నారు. 20వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 16,199 మందికి కంటి పరీక్షలు చేయగా, వికారాబాద్ జిల్లాలో 5,621 మందికి కంటి పరీక్షలు చేశారు.
-షాబాద్, ఫిబ్రవరి 16
షాబాద్, ఫిబ్రవరి 16 : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,199 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,958 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,682 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది కంటి వెలుగు క్యాంపుల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు.
5 గ్రామాలు, 27 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 5621 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 834 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 624 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 102 గ్రామాలు, 27 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
అద్దాలు ఇచ్చారు : నర్సింహులు, తంగడిపల్లి, చేవెళ్ల మండలం
కంటి వెలుగు శిబిరాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడంతో మాలాంటి వారికి ఎంతో ఉపమోగపడుతున్నాయి. గతంలో కంటి పరీక్షలు చేసుకోవాలంటే దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఊరికే వచ్చి పరీక్షలు చేసి.. అద్దాలు, మందులు అందిస్తున్నారు. నాకు చూపు మసకగా కనిపిస్తుండడంతో అద్దాలిచ్చారు.