వికారాబాద్, అక్టోబర్ 30, (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తూ ప్రజలందరి నుంచి హర్షాతిరేకాలను పొందుతున్నది. బీఆర్ఎస్ సర్కార్ అమల్లోకి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో జిల్లాలో పేదల కుటుంబాల్లోని చాలా మందికి ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆహారభద్రతలో భాగంగా పరిమితుల్లేకుండా బియ్యం, సరుకుల పంపిణీ, గొర్రెల పెంపకం తదితర పథకాల ఫలాలు పొందుతున్నారు.
గతంలో ఒక్క కుటుంబానికి ఒక పథకం ఫలాలు అందితే మరో పథకానికి అనర్హులుగా గుర్తించి, వారిని అర్హుల జాబితా నుండి తొలగించేవారు. సీఎం కేసీఆర్ ఎలాంటి పరిమితి లేకుండా కుటుంబంలో ఎంతమంది ఆయా సంక్షేమ పథకాలకు అర్హులుంటే అందరికీ సంబంధిత సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వాల పాలనలో వ్యవసాయానికి గంటో, రెండు గంటలు మాత్రమే వచ్చే కరెంట్ సరఫరాను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ చీకటవుతుందన్న సమైక్యాంధ్ర నేతల అసత్య ప్రచారాలను తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది.
సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల అభ్యున్నతికి భారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నది. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయమందించేందుకుగాను కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలుచేస్తూ పేద ప్రజలకు సీఎం కేసీఆర్ సాయం అందిస్తున్నారు. పింఛన్ డబ్బులను రెట్టింపు చేసి ఏ దిక్కు లేని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేతలు తదితర పింఛన్దారులకు ఆసరా కల్పిస్తుండడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెలువడుతున్నాయి. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకుగాను గొల్ల, కుర్మలకు గొర్రెలు, మత్స్యకారులకు చేపల పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
మాది వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామం. మా తల్లిదండ్రులు బాసుపల్లి యాదవరెడ్డి, నాగరాణి. నాకు తమ్ముడు విష్ణువర్దన్రెడ్డి ఉన్నాడు. మూడు ఎకరాల భూమి, బోరు సాయంతో పంటలు పండిస్తున్నాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు చాలా బాగున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీమా తీసుకున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న యాదవరెడ్డి మరణించారు. బీఆర్ఎస్ పార్టీ బీమా నుండి రూ.2లక్షలు, రైతుబీమా పథకం నుంచి రూ.5లక్షలు మా కుటుంబానికి అందాయి. మూడు ఎకరాల భూమి ఉన్నందున రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడికి సాయం అందుతున్నది. పొలంలో బోరు ఉండటంతో ఉచిత కరెంట్ అందుతుంది. మా అమ్మకు ఆసరా పింఛన్ రూ.2016 వస్తున్నాయి. ఇంటికి మిషన్ భగీరథ నీరు సైతం అందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు మా కుటుంబానికి అండగా నిలిచాయి. 6 సంక్షేమ పథకాలు మా కుటుంబానికి అందాయి.
– బాసుపల్లి రాఘవేందర్రెడ్డి, పులుమద్ది, వికారాబాద్
నాది యాలాల మండలం కోకట్ గ్రామం. నిరుపేద కుటుంబం మాది. భర్త రాజుగౌడ్ మృతి చెందడంతో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకం ద్వారా రూ.5లక్షలు రావడంతో గ్రామంలో దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నా. కూతురు, కొడుకును మంచిగా చదివిస్తున్నా. నాకు, మా అత్తకు కూడా వితంతు పింఛన్ వస్తున్నది. దీంతో మంచిగా బతుకుతున్నాం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పేద మహిళలకు రూ.400 గ్యాస్, పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వం నుంచి పొందిన ఆర్థికసాయంతోనే ఈ ఈరోజు మేము బాగున్నాం. అందుకు సహకరించిన సర్కార్కు కృతజ్ఞతలు.
– ఈడ్గి అఖిల కోకట్, తాండూరు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలను ఆదుకుంటున్నాయి. ప్రతి ఇంటికీ ఏదో ఒకవిధంగా ప్రభుత్వ పథకం అందుతున్నది. నాకు గత ఏడాది దళితబంధు పథకం మంజూరైంది. ట్రాక్టర్ తెచ్చుకుని పొలాన్ని దున్నుకోవడంతో పాటు కిరాయికి ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నా. రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు ట్రాక్టర్ కిరాయికి పంపితే రూ.5వేల వరకు మిగులుతాయి. ట్రాక్టర్ లేనప్పుడు పొలం దున్నడానికి ట్రాక్టర్ కిరాయికి తెచ్చుకునేవాడిని ఇప్పుడు కిరాయి తేవడం తప్పింది. ట్రాక్టర్ రావడం వల్ల వ్యవసాయం కూడా మంచిగా చేసుకుంటున్నా. నాకు కొద్దిగా పొలం ఉంది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం అందుతుంది. సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటా.
-బ్యాగరి బాలప్ప, బొంరాస్పేట