సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది. ఓఆర్ఆర్ ప్రధాన రహదారితో పాటు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల వెంబడి రోజు రోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఈ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును చేపట్టింది. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ఎంతో దూర దృష్టితో నగర వాసులు మెట్రో రైలు ద్వారా విమానాశ్రయానికి అత్యంత వేగంగా చేరుకునేలా మొదటి దశ మెట్రోను అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. 5 ఏళ్ల కిత్రమే దీనిపై ఢిల్లీ మెట్రోతో సర్వే చేయించి, ప్రాథమికంగా డీపీఆర్ను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఐదేళ్లలో రెండు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. ఇంకా పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉండడంతో మరోసారి ఈ ట్రాఫిక్ సర్వే చేసి, దానికి అనుగుణంగా ప్రాజెక్టులో మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిపై హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు, ప్రైవేట్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టు నిపుణులతో కలిసి పని చేస్తున్నారు.
బుద్వేల్లో 180 ఎకరాల్లో భారీ వెంచర్..
ఐటీ కారిడార్- శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సుమారు 180 ఎకరాల్లో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండడంతో ఇక్కడ బహుళ అంతస్థులతో కూడిన భవనాలు రానున్నాయి. ఇక్కడి ప్లాట్ల సైజు కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ తరహాలో ఎకరాల్లోనే ఉండేలా ప్రణాళికను రూపొదించారు. ఇప్పటికే రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను ఐటీ సెజ్లకు అనుకూలంగా లేఅవుట్లు రూపొందించాలని నిర్ణయించారు. ఇలాంటి ప్రాంతాల్లో భవిష్యత్తు మరింత ట్రాఫిక్ పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు ఆయా ప్రభుత్వ శాఖలు మెట్రో అధికారులకు సూచించారు. ఇలా 31 కి.మీ పొడవునా ఔటర్ రింగు రోడ్డు వెంబడి అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉండడం, దానికి తోడు కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం అవుతుండడంతో ట్రాఫిక్ పెరుగుదలపై ప్రధానంగా దృష్టి సారించారు.
2041 వరకు పెరిగే ట్రాఫిక్ను ఎయిర్పోర్టు మార్గం నిర్మాణంలో పరిగణలోకి తీసుకోనున్నారు. పేరుకు ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ వే అయినా 31 కి.మీ పొడవున ఉన్న శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి సైతం మెట్రో సౌకర్యం అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రెండు మెట్రో మార్గాలో ఉన్న రద్దీ ఉన్నట్లుగానే ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గంలోనూ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అధ్యయనం చేసి ఎయిర్పోర్టు మెట్రో మార్గం నిర్మా ణం చేపడతామని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.
భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలు..
రాయదుర్గం నుంచి గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న 31 కి.మీ పరిధి మార్గంలో ఉన్న ప్రాంతమంతా అభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ చుట్టూ ఇరువైపులా ఒక కిలోమీటరు దూరం గ్రోత్ కారిడార్గా గుర్తించడంతో ఈ ప్రాంతంలో నివాస ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఉత్పత్తి జోన్లు, పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాదాపూర్,రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట, నార్సింగి, పుప్పాల్గూడ ప్రాంతాలు ఐటీ కంపెనీలకే కాకుండా నివాస ప్రాంతాలకు అత్యంత ఆదరణ పొందిన ప్రాంతాలుగా మారాయి. ఇదే స్థాయిలో నార్సింగి తర్వాత నుంచి ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ఉన్న రాజేంద్రనగర్, బుద్వేల్, తెలంగాణ పోలీస్ అకాడమీ, అజీజ్నగర్, హిమాయత్సాగర్, శంషాబాద్, రాళ్ల గూడ, కొత్వాల్గూడ వంటి ప్రాంతాలు నివాసంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఉంది. దీంతో ప్రజలు ఈ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేదుకు అవకాశం ఉన్నట్లు మెట్రో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి అనుగుణంగానే మెట్రో స్టేషన్ల నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.