తాండూరు : ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వాహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎండ్లబండిపై ప్రత్యేక ర్యాలీతో పాటు మహిళ రైతుల ఆటపాటలతో సంక్రాంతి పండుగల సంబురాలు నిర్వహిస్తు తెలంగాణ సర్కార్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతులకు పెద్ద పీట వేయడంతో రైతులకు చాల లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు రైతులు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, పాలక వర్గం సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, రైతులు ఉన్నారు.