రంగారెడ్డి, మార్చి 17 (నమస్తే తెలంగాణ)/బొంరాస్పేట : రంగారెడ్డి, వికా రాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరుగనున్న పదోతరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 986 పాఠశాలల నుంచి 50,946 మంది రెగ్యులర్, 1,012 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 239 కేంద్రాలు, ప్రైవేట్ విద్యార్థులకోసం మరో 10 కేంద్రాలను అధికారులు ఏర్పా టు చేశారు. వికారాబాద్ జిల్లాలో 13,412 మంది స్టూడెంట్స్ టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఏయిడెడ్ బడుల నుంచి 39మంది, బీసీ గురుకులాల నుంచి 688మంది, ఎస్సీ గురుకులాల నుంచి 534మంది, ఎస్టీ ఆశ్రమ స్కూళ్ల నుంచి 343మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2848మంది, ఎస్టీ గురుకులాల నుంచి 321మంది, మైనార్టీ గురుకులాల నుంచి 277మంది, టీఆర్ఐఈఎస్ నుంచి 151, మాడల్ స్కూళ్ల నుంచి 810మంది, జడ్పీహెచ్ఎస్ల నుంచి 6195 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 385, కేజీబీవీల నుంచి 821 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 6913 మంది బాలురు, 6499 మంది బాలికలున్నారు. ఇందుకోసం జిల్లాలో 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 5నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు ప్రభు త్వం అనుమతించింది. పాఠశాలల హెడ్మాస్టర్ల ద్వారా విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ఎవరైనా అందని వారుంటే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల సందర్భంగా సరిపడా బస్సులను ఆర్టీసీ నడుపనున్నది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో..
ఉమ్మడి జిల్లాలో పదోతరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ప్రతి పరీక్షా కేంద్రానికీ ఓ చీఫ్ సూపరింటెండెంట్, ఓ డిపార్ట్మెంటల్ అధికారిని..అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 2,450 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి కేంద్రానికీ ఓ సిట్టింగ్ స్కాడ్ను ఏర్పాటు చేశారు. 10 రూట్లలో కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను సరఫరా చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలో 772 మంది ఇన్విజిలేటర్లు, 164 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఐదు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాస్కాపీయింగ్ కట్టడికి ప్రతి పరీక్షా కేంద్రంలో ఇతర శాఖలకు చెందిన అధికారులను సిట్టింగ్ స్కాడ్లుగా నియమించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులు, పరీక్ష సిబ్బంది ఎవరూ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడం నిషేధం. విద్యార్థులు హాల్టికెట్, ప్యాడ్, పెన్ను, పెన్సిల్, స్కేలు, జామెట్రీ తదితర పరికరాలను మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నది. పరీక్ష ముగిసే వరకు విద్యార్థులు, సిబ్బంది బయటికి వెళ్లేందుకు అనుమతించరు.
144 సెక్షన్ విధింపు..
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు జరిగే సమయంలో సెంటర్లకు సమీపంలో ఉన్న జీరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. ఏమైనా సందేహాలుంటే విద్యాశాఖ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్లోని ఫోన్నంబర్ 8019236220 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల్లో ఎవరైనా కాపీయింగ్కు పాల్పడితే డిబార్ చేస్తామని విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పరీక్షల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిబంధనల మేరకు చర్యలు తప్పవని సూచిస్తున్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు హాల్ టికెట్లను సరి చూసుకోవాలి. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి. విద్యార్థులు, పరీక్షలు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు, సెల్ఫోన్లను కేంద్రాల్లోకి తీసుకెళ్లొద్దు. ఏమైనా సందేహాలుంటే విద్యాశాఖ కార్యాలయంలోని 08416-235245 నంబరులో సంప్రదించాలి.
-నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్