పూజలు, ప్రార్థనలతో ఉమ్మడి జిల్లాలో ఆధాత్మికత వెల్లివిరిసింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మొయినాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ అత్యధిక నిధులతో ఆలయాలను అద్భుత రీతిలో పునరుద్ధరిస్తున్నారన్నారు.
మొయినాబాద్/చేవెళ్ల రూరల్/శంకర్పల్లి/చేవెళ్లటౌన్, జూన్ 21 : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని పూజలు చేశారు. అనంతరం అజీజ్నగర్ గ్రామంలో మన ఊరు-మన బడి పాఠశాల భవనాన్ని ప్రారంభించడంతో పాటు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న శంకర్పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో రూ. కోటి రూపాయలతో నిర్మించ తలపెట్టిన భవనాన్ని ఆమె బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అంతకుముందు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకున్నారు.
చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ గ్రామంలోని మన ఊరు-మన బడి కార్యక్రమాల్లో భాగంగా రూ.56.86 లక్షలతో చేపట్టిన ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల భవనాలను ప్రారంభించారు. అదే విధంగా శంకర్పల్లి మండల పరిధిలోని మిర్జాగూడ నుంచి జన్వాడ వరకు రూ.7 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ బడులను ఎంతో బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 25 లక్షల మంది విద్యార్థులకు రూ.136 కోట్లతో రెండు జతల యూనిఫామ్లు, రూ.190 కోట్లతో ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాదికి రూ.35 కోట్లతో రాగి జావ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులకు రూ.56 కోట్ల విలువ గల నోట్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలోని 20వేల మంది ఉపాధ్యాయులకు రూ.34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్లు అందించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో 9123 పాఠశాలలో రూ.3497.62 కోట్లతో పనులు చేపట్టి దాదాపు 1000 పాఠశాలలను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 12 వందల గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షా 20వేలు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. జిల్లాలో రూ.6 కోట్లతో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు రూ.5 కోట్ల విలువ చేసే 72వేల మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు రూ.18.15 లక్షలతో రాగి జావ అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని మంత్రి సబితారెడ్డి అన్నారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని రూ.200 నుంచి 250 కోట్లతో పునర్నిర్మాణం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు దేశం చూస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రైతుబంధుతో రైతులకు ఆర్థిక సాయం అందించిన తరువాత వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. రైతు బీమాను ప్రవేశ పెట్టి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఈవో సుశీందర్, శంకర్పల్లి గురుకులకళాశాల ప్రిన్సిపల్ జయమ్మ, మొయినాబాద్ ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ మమత, ఎంపీడీవో సంధ్య, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంఈవో వెంకటయ్య, అజీజ్నగర్ సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, చిలుకూరు సర్పంచ్ స్వరూప, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, కందవాడ సర్పంచ్ అరుంధతి, శంకర్పల్లి ఎంపీపీ గోవర్దన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఏఎంసీ చైర్మన్ పాపారావు, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, ఏఎంసీ వైస్ వెంకటేశ్, మొయినాబాద్ సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, సర్పంచ్లు రాజు, శ్రీనివాస్, మంజూల, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, నాయకులు రాజు, శ్రీశైలం, రాజు పాల్గొన్నారు.