ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 4; అన్నదాత అప్పుల తిప్పలు తీర్చిన రైతుబంధు.. కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకుంటున్న రైతు బీమా.. ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి.. ఆసరా పింఛన్లు.. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకం అద్భుతమని.. ఇవన్నీ తమ రాష్ట్రంలోనూ అమలుకావాలి.. తమకూ అందాలని మహారాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. నాందేడ్లో ‘ఆదివారం జరుగనున్న బీఆర్ఎస్ సభ’ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు కంపెనీల్లో పని చేస్తున్న ఆ రాష్ట్రవాసులు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రగతి పథంలో ముందుందన్నారు.
ఇక్కడ అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిత్యం కండ్లారా చూస్తున్నామని, ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. బీఆర్ఎస్తో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం.. దేశ ప్రజలందరూ ఆదరించడం బాగుందన్నారు. నాందేడ్లో జరుగుతున్న కేసీఆర్ సభకు వెళ్లేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. బంధువులు కూడా ఫోన్ చేసి ఈ సభ గురించే మాట్లాడుతున్నారన్నారు. దేశమంతా కేసీఆర్ నాయకత్వం రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉన్నాయి… ఇలాంటి పథకాలు దేశవ్యాప్తమైతే చాలా బాగుంటుంది.. రైతులు, పేదల కోసం అమలవుతున్న పథకాలు మా మహారాష్ట్రలోనూ అమలైతే బాగుంటుంది..’ అని తాండూరులో జీవనం సాగిస్తున్న మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు మహారాష్ట్రలోనూ అమలు చేయాలని కోరుతున్నారు. ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందించే పథకాలు దేశవ్యాప్తం కావాలంటే సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్గా ప్రకటించడంతో దేశ ప్రజలకు మేలు జరుగనున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఆదివారం మహారాష్ట్రలో నిర్వహించే తొలి భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు అక్కడున్న తమ బంధుమిత్రులకు ఫోన్చేసి సభకు వెళ్లాలని తెలిపామని శనివారం తాండూరులో ఉన్న మహారాష్ట్ర వాసులు ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు. మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితికి ప్రజల నుంచి మంచి ఆదరణ, మద్దతు లభిస్తున్నదని తెలిపారు.
తెలంగాణ పథకాలు బహుత్ అచ్చా..
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలు చాలా బాగున్నాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అనేక సౌకర్యాలకు నోచుకుంటున్నారు. మహిళలు, రైతులు, చేతివృత్తుల వారు, వలస కూలీలకు చేతినిండా పనిదొరుకుతున్నది. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు కావాలంటే కేసీఆర్ వంటి నాయకుడు ఎంతో అవసరం. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో కూడా కొనసాగిస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినందున నేడు నాందేడ్లో జరుగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరుకానున్నారు. మేము తెలంగాణాలో ఉన్నప్పటికీ మా బంధువులు, మిత్రులు, ఇతర కుటుంబ సభ్యులను బహిరంగ సభకు వెళ్లాలని ఫోన్ల చేసి తెలియజేశాం. దీంతో తెలంగాణ తరహాలో మహారాష్ట్రలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు జరుగుతాయని భావిస్తున్నాం..’ అని ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న మహారాష్ట్ర వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తెలంగాణాలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు..
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అలాగే, మహిళలు ఆర్థికంగా అబివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారు. మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేస్తుండడంతో కిరాణా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పలు రకాల షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. గ్రామీణ మహిళలు గేదెలు, గొర్రెలు, చిన్నచిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని హుందాగా బతుకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళలంతా సుభిక్షంగా ఉన్నారు. ప్రభుత్వం మహిళల కోసం దేశంలో ఎక్కడలేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహిస్తున్నది. మహారాష్ట్రలోనూ ఇలాంటి పథకాలు అమలు కావాలంటే సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితేనే సాధ్యం.
– ఆశ, మాండ్య, నాందేడ్
తెలంగాణ పథకాలు అద్భుతం..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన నేను అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో వ్యాపార నిమిత్తం తాండూరుకు వచ్చి స్థిరపడ్డాను. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలు చేయాలి. పేదలను ఆదుకోవాలి. తెలంగాణలో ఉన్న ప్రాంతీయ టీఆర్ఎస్ను మార్చి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా చేయడం చాల సంతోషంగా ఉన్నది. దేశ అభివృద్ధి, పేదల బాగు కోసం శ్రమిస్తున్న కేసీఆర్కు ఎల్లప్పుడు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. నేడు మహారాష్ట్రలో జరుగుతున్న తొలి బీఆర్ఎస్ సభ విజయవంతం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేశాం.
– రామచంద్ర, సోలాపూర్, మహారాష్ట్ర
తెలంగాణ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలి..
ఐదేండ్లుగా తెలంగాణలో జీవిస్తున్నా. మాది నాందేడ్ జిల్లా అయినప్పటికీ పొరుగునే ఉన్న తెలంగాణలో ఉపాధి కోసం వచ్చాం. తెలంగాణ పథకాలు చాలా బాగున్నాయి. దేశానికే తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుపడుతుంది.
– బాహురావు, ఇస్లాపూర్, నాందేడ్
కేసీఆర్ రావాలి.. పేదల గోస తీరాలి..
సీఎం కేసీఆర్ సార్ గురించి చాలా విన్నాం. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎంతో గొప్పవి. ఇంతటి సుపరిపాలనను అందిస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉన్నది. ఇక్కడి పథకాలన్నీ మా మహారాష్ట్రలోనూ అమలుకావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్తోనే దేశంలోని రైతులు, పేదల గోస తీరుతుంది. మహారాష్ట్రలో జరిగే బీఆర్ఎస్ సభకు వెళ్లాలని మా వాళ్లకు చెప్పా. సభ విజయవంతం కావడం ఖాయం.
– శాంతాబాయి, ధారవిమాటుంగ,మహారాష్ట్ర