మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టడంతోపాటు భవనాలకు మరమ్మతులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణం, పెయింటింగ్, ప్రహరీలు, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలో మొదటి విడుతలో భాగంగా 371 స్కూళ్లలో పనులు చేపట్టారు. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద 37 స్కూళ్లలో పనులు పూర్తిచేయగా.. ఇప్పటికే 20 పాఠశాలలను ప్రారంభించారు. మరో 17 స్కూళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 68 బడుల్లోనూ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే జిల్లావ్యాప్తంగా 111 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వం జిల్లాకు రూ.11కోట్లను విడుదల చేసింది.
– వికారాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ
వికారాబాద్, ఆగస్టు 8,(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకుగాను చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు బడుల్లో సకల వసతులు కల్పించడంతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 37 స్కూళ్లలో ఇప్పటికే 20 స్కూళ్లను ప్రారంభించగా, మరో 17 స్కూళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
మరో 68 స్కూళ్లలో కూడా మన ఊరు-మన బడి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ నెలాఖరు నాటికి సంబంధిత 68 స్కూళ్లలో పనులు పూర్తి చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడుతలో 371 స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకుగాను ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 పాఠశాలలున్నాయి. 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని పనులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు మన ఊరు-మన బడి పనులకుగాను రూ.11 కోట్ల నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసింది.
ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకుగాను చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
అదేవిధంగా డిజిటల్ బోధన షురూ చేశారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన 111 ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ బోధన అందిస్తున్నారు. 8,9,10వ తరగతుల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంచడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. డిజిటల్ విధానంలో పాఠాలు బోధించడానికి మల్టిఫుల్ ఫీచర్స్ డిజిటల్ స్క్రీన్ డివైజ్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లకు నైట్ వాచ్మెన్లను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా 160 స్కూళ్లకు నైట్ వాచ్మెన్లను ఏర్పాటు చేశారు.
వేగంగా మన ఊరు-మన బడి పనులు..
జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20 స్కూళ్లను ప్రారంభించగా, మరో 17 స్కూళ్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరో 68 స్కూళ్లలో పనులు తుది దశకు చేరుకున్నాయి, సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొదటి విడుతలో చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.
– రేణుకాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి