షాబాద్, అక్టోబర్ 13 : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పేదల జీవన ప్రమాణాల పెంపునకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒక్కో లబ్ధిదారుడికి 10కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించనున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 919 రేషన్ దుకాణాలకు గాను 5,58,890 ఆహారభద్రతా కార్డులున్నాయి. వీటి ద్వారా 18,35,605 మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో పేదలకు మరింత ఆహారభద్రత చేకూరనున్నది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల కడుపునింపేందుకు సీఎం కేసీఆర్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం సంతోషకరమని చెబుతున్నారు.
జిల్లాలో 5,58,890 ఆహారభద్రతా కార్డులు..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 27 మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల్లో 919 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో 5,58,890 ఆహారభద్రత కార్డులున్నాయి. మూడు నెలలకు సంబంధించి 28,305 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా 18,35,605 మందికి లబ్ధి చేకూరనున్నది. పేదల కోసం ఎంత ఆర్థిక భారమైనా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండడం గొప్ప పరిణామం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలో మూడు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టామని, ప్రతి నెలా ఒక్కొక్కరికీ 10కిలోల చొప్పున లబ్ధిదారులకు బియ్యం అందిస్తామని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
పేదలకు మరింత ఆహారభద్రత..
పేదలకు ఉచిత బియ్యం అందించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆహారభద్రత పథకంలో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా సాధారణ రోజుల్లో కిలో రూ. 1 చొప్పున ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యం అందిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి నిర్ణయంతో డిసెంబర్ దాకా మూడు నెలల పాటు 10కిలోల ఉచిత బియ్యం సరఫరా చేయనున్నారు. ఇంతకు ముందు కరోనా సమయంలో వలస కూలీలకు రూ. 500, ప్రతి ఆహారభద్రతా కార్డుకు రూ. 1500 చొప్పున రెండు నెలలు అందించారు.
ఒక్కొక్కరికీ పది కిలోలు అందజేస్తాం
ప్రభుత్వ ఆదేశానుసారం మూడు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నాం. జిల్లా వ్యాప్తంగా 919 రేషన్ దుకాణాల్లో 5,58,890 ఆహారభద్రత కార్డులున్నాయి. ఇందులో 18,35,605 మంది లబ్ధిదారులున్నారు. డిసెంబర్ వరకు వీరందరికీ 10కిలోల చొప్పున 28,305 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నాం.
– ఎంకే.రాథోడ్, రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి
ఉచిత బియ్యం అందించడం సంతోషకరం
ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం సంతోషకరం. బయట కిరాణా షాపుల్లో బియ్యం కొనాలంటే కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు ధర ఉంది. పేదోళ్లు అంతా డబ్బులు పెట్టి బియ్యం కొనాలంటే అవస్థలు పడాల్సిందే. పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కడుపునిండా బువ్వ తినాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 10కిలోల ఉచిత బియ్యం అందించడం సంతోషంగా ఉంది.
– నసీమ్, సర్దార్నగర్, షాబాద్ మండలం