వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పశువుల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సబ్సిడీపై పాడి పశువులను అందజేయడంతో పాటు వాటి ఆరోగ్యానికి సంబంధించి పల్లెలు, మండల కేంద్రాల్లోని పశువైద్య శాలలతో పాటు మొబైల్ వాహనాల్లో పల్లెపల్లెకూ తిరుగుతూ వైద్య సేవలను అందిస్తున్నది. రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా సబ్సిడీపై గడ్డి విత్తనాలను అందజేస్తూ పాడి రైతులకు చేయూతనందిస్తున్నది. రంగారెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు మండల కేంద్రాలు, గ్రామాల్లోని పశు వైద్య కేంద్రాల్లో పశు గ్రాస విత్తనాలను నిల్వ చేసి, 25 నుంచి 75 శాతం వరకు రాయితీపై ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 143.141 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను పంపిణీ చేశారు. అన్నదాతల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కార్ తీరుకు పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఎండాకాలంలో మూగ జీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తుగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో పశువులకు గ్రాసం కొరత ఏర్పడి పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. వేల రూపాయలు పోసి పశువులకు గ్రాసం కొనలేక రైతులు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతుంటారు.
పాడి రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం రైతులకు గడ్డి విత్తనాలను అందించేందుకు ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1,88,182 ఆవులు, ఎద్దులు తదితర పశువులున్నాయి. 1,22,587 గేదె జాతి పశువులున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 143.141 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను పాడి రైతులకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు అందించారు. రైతులకు పంపిణీ చేసేందుకు అవసరమైన, సరిపడా గడ్డి విత్తనాలను పశు వైద్యశాలల వద్ద నిల్వ ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు.
మండల, గ్రామ పశు వైద్య కేంద్రాల్లో అందుబాటులో విత్తనాలు
జిల్లాలో పశుగ్రాసం కొరత నివారణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం రాయితీపై గడ్డి విత్తనాలను అందించేందుకు పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే 143.141 మెట్రిక్ టన్నుల విత్తనాలను పాడి రైతులకు పంపిణీ చేసిన పశు సంవర్ధక శాఖ అధికారులు ఇంకా అవసరమైన రైతులకు పంపిణీ చేయడానికి అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని పశు వైద్య కేంద్రాల్లో నిల్వ చేశారు. 25 నుంచి 75 శాతం వరకు రాయితీపై గడ్డి విత్తనాలను ప్రభుత్వం పాడి రైతులకు పంపిణీ చేస్తున్నది. మిగతా ధరను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. గడ్డి విత్తనాలు అవసరమైన రైతులు స్థానిక పశు వైద్య కేంద్రాల్లో పొందవచ్చని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న గడ్డి విత్తనాలతో పశుగ్రాసం పెంపకంపై పాడి రైతులకు పశు సంవర్ధక శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ‘గడ్డి విత్తనాలను నాటేందుకు భూమిని ఏ విధంగా చదును చేయాలి?, వాటిని ఎలా విత్తాలి? నీటి తడులు ఏ విధంగా పెట్టాలి? ఏ దశలో గడ్డిని సేకరించాలి? కోసిన గడ్డి వృథా కాకుండా ఎలా వినియోగించుకోవాలి?’ అనే అంశాలపై పాడి రైతులకు అధికారులు సూచనలిస్తున్నారు.
2022-23లో జిల్లాలో పంపిణీ చేసిన గడ్డి విత్తనాలు
స్కీమ్ పేరు – గడ్డి విత్తన రకం – విత్తన నిల్వ కిట్స్ – మెట్రిక్ టన్నులలో పంపిణీ అయిన మొత్తం – పూర్తి ధర – ప్రభుత్వ రాయితీ – రైతు వాటా
1). ఎన్ఎల్ఎం – మొక్కజొన్న రకం – 0.25 – 1.25 – రూ.75,000 – రూ.56,250 – రూ.18,750
2). ప్లాన్ బడ్జెట్ (ఆఫీస్ ఆఫ్ డీవీఏహెచ్వో, ఆర్ఆర్) – లుసెర్న్ రకం – 1546 – 1.546 – రూ.5,99,848 – రూ.4,49,886 – రూ.1,49,962
3). ఎన్ఎల్ఎం – సీఎస్హెచ్-24 ఎంఈ – 12,600 – 63 – రూ.55,12,500 – రూ.41,34,375 – రూ.13,78,125
4). ప్లాన్ బడ్జెట్, హెడ్ ఆఫీస్ – ఎస్ఎస్జీ-898 – 10,000 – 50 – రూ.24,30,000 – రూ.18,22,500 – రూ.6,07,500
5). ప్లాన్ బడ్జెట్ (ఆఫీస్ ఆఫ్ డీవీఏహెచ్వో, ఆర్ఆర్) – ఎస్ఎస్జీ-898 – 5,469 – 27.345 – రూ.13,28,967 – రూ.9,96,725 – రూ.3,32,242
పశుగ్రాసం కొరత తీరేలా…
– అంజిలప్ప, జేడీ, డీవీఅండ్ఏహెచ్వో
ఎండాకాలంలో పశువులకు గ్రాసం కొరత తీరేందుకు ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఆవులు, గేదెలు ఉన్న పాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పలు రకాల గడ్డి విత్తనాలపై 25% నుంచి 75% వరకు రాయితీ ఇస్తున్నది. పశు సంవర్ధక శాఖ రైతుల కోసం గడ్డి విత్తనాలను అందుబాటులో ఉంచినది. ఇప్పటికే జిల్లా 143.141 మెట్రిక్ టన్నుల విత్తనాలను పంపిణీ చేశాం. ఇంకా ఎవరికైనా గడ్డి విత్తనాలు అవసరమైతే ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లోని పశు వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. గడ్డి విత్తనాలు అడిగిన ప్రతి రైతుకూ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పశుగ్రాసం పెంపకంపై రైతులకు పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నాం.