సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : సైబర్ మోసాల్లో నేరగాళ్లు కొట్టేస్తుంది కొండంత అయితే.. పోలీసులు రికవరీ చేస్తోంది గోరంతగా ఉంటుంది. సైబర్ పోర్టల్పైనే పూర్తి భారమేస్తున్నారు. 1930కి గోల్డెన్ అవర్లో సంప్రదిస్తే బాధితులకు పోయిన సొత్తులో కొంతైనా రికవరయ్యే అవకాశాలుంటాయి. ఆలస్యం చేస్తే పోయిన సొత్తు రికవరీ చేయడం కష్టంగా మారుతుంది. 1930 అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్పోర్టల్ సహాయంతో రికవరీలో మరింత మెరుగైన ఫలితాలు చూపించాల్సిన పోలీసులు, ఆ దిశగా ఫలితాలు రాబట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో సైబర్ నేరాలపై కేసుల నమోదు ఒక వైపు… నేరగాళ్లు ఎక్కడున్నా వాళ్ల ఆటకట్టించేందుకు యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, చత్తిస్ఘడ్, పశ్చిమబెంగాల్ ఇలా అన్ని రాష్ర్టాల్లో బృందాలు తిరుగుతూ నేరగాళ్ల ఆటకట్టించేవారు. నేడు ఆరు నెలలకోసారి మేమున్నామంటూ చెప్పుకోవడం కోసమే నిందితులను పట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో సుమారు ఆరు వేల వరకు కేసులు నమోదవుతుంటాయి. వీటికి ఆయా శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసులు అదనం.
సైబర్నేరాలు జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో 1930కి, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే పోయిన సొత్తు వెనక్కి వచ్చేందుకు అవకాశాలుంటాయి. దీంతో బాధితుల్లో అవగాహన పెంచేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే బాధితులు ఈ పోర్టలో ఫిర్యాదు చేయడం, ఆ తరువాత పోర్టల్ నుంచి బాధితులు డిపాజిట్ చేసిన సైబర్ నేరగాళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయి, ఆయా ఖాతాల్లో డబ్బు ఉందంటే అవి బాధితులకు తిరిగి వచ్చేందుకు అవకాశాలుంటాయి. నిందితుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు అప్పటికే నేరగాళ్లు డ్రా చేశారంటే రికవరీ కష్టంగా మారుతుంది. బ్యాంకు ఖాతాదారులు ఎక్కువగా ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఉంటారు.
పోలీసులు బ్యాంకు ఖాతాదారులను పట్టుకోవడం మాత్రం జరుగుతుంది. అయితే ఇతర రాష్ర్టాల్లో ఉండే సైబర్ నేరగాళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాదారులను పట్టుకోకుండా చాలాసార్లు ఆయా కేసులను పక్కన పెట్టేస్తుంటారు. ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఇలాంటి బ్యాంకు ఖాతాలున్నాయంటే మాత్రమే పోలీసులు పట్టుకుంటారు. ఇలాంటి బ్యాంకు ఖాతాదారుల వద్ద కూడా కొందరు సైబర్ పోలీసులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఖాతాదారులను అరెస్ట్ చేయకుండా ఉండడం, నోటీసులతో సరిపెట్టడం ఇలా పలు రకాలుగా నిందితులకు ఫేవర్ చేస్తామంటూ కొందరు సైబర్ పోలీసులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
1930 వచ్చిన తరువాత ఐ4సీ పనిచేయడం, అన్ని రాష్ర్టాలు సమన్వయంతో పనిచేస్తుండడంతో నేరస్తుల సమాచారం ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వంపై దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇన్ని అవకాశాలున్నా సైబర్క్రైమ్ పోలీసులు మాత్రం మెరుగైన ఫలితాలు కనబరచడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. కొందరు పోలీసులైతే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందని, వాళ్లు చూసుకుంటారు, మనకెందుకు అంత రిస్క్… ఇక్కడిక్కడ నేరగాళ్లు ఎవరైనా ఉంటే పట్టుకుందామనే ధోరణిలో కూడా కొందరు అధికారులున్నారనే ఆరోపణలై సైతం విన్పిస్తున్నాయి.
సైబర్ క్రైమ్పై పూర్తి అవగాహన ఉండే సమర్థులైన అధికారులు ఎప్పుడైతే ఆ విభాగాన్ని లీడ్ చేస్తారో, అప్పుడు బాధితులకు న్యాయం జరిగే అవకాశాలుంటాయి. సైబర్ నేరాలు, టెక్నాలజీపై అంతగా పట్టులేని అధికారులు ఆయా పోస్టుల్లో ఉండడంతో కూడా క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు సిబ్బంది నామ మాత్రంగా విధులు నిర్వహించేందుకు అవకాశాలుంటాయి. సైబర్నేరాలు జరగకుండా ఉండాలంటే అవగాహన కార్యక్రమాలు కల్పించడం, సైబర్నేరాల్లో ఉండే చైన్ సిస్టమ్ను ఎక్కడికక్కడ తెగొట్టి, మూలాల వరకు వెళ్లి నిందితులను పట్టుకోవాల్సిన అవసరముంటుంది.
కొందరు అధికారులైతే ఆయా విభాగాలను లీడ్ చేస్తూ క్షేత్ర స్థాయి అధికారుల వద్ద నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితులున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. అధికారికి ఎప్పుడైతే పట్టు ఉంటుందో ఆ విభాగంలో మంచి ఫలితాలు రాబట్టేందుకు అవకాశముంటుందనే వాదన విన్పిస్తోంది.