బొంరాస్పేట, జూలై 17 : మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు రెట్లు పెంచిన గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి రూపాయలు ఉన్న గౌరవ వేతనాన్ని ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది. సీఎం కేసీఆర్ గత ఏడాది అసెంబ్లీలో గౌరవ వేతనాన్ని పెంచుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 1646 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబు రు అందించింది. వీరికి పెంచిన గౌరవ వేతనం ఈ నెల నుంచే చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మధ్యాహ్న భోజన పథకంలో పని చేసే కా ర్మికులకు చెల్లించే గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో పెంచింది. కార్మికులకు నెలకు ఇస్తున్న వెయ్యి రూపాయల గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచింది. ఈ మేరకు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథ కం అమలు చేస్తున్న కార్మికులకు గౌరవ వేతనం పెంచుతామని సీఎం కేసీఆర్ గతేడాది అసెంబ్లీలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం వేతనాలను పెంచి ఈ నెల నుంచే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో మధ్యాహ్న భోజనం అమలులో భాగంగా ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే ఇవ్వాలనే నిర్ణయంపై మధ్యాహ్న భోజన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం వాటా ఆరు వందలే..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకంలోని కుక్ కం హెల్పర్లకు రూ.వెయ్యి మాత్రమే చెల్లించాలి. దీనిలో 60:40 నిష్పత్తి ప్రకారం కేంద్రం రూ.600 చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 చెల్లిస్తున్నది. పెంచిన రూ.2 వేలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.2400 చెల్లిస్తుండగా కేంద్రం రూ.600 మాత్రమే ఇవ్వనుంది.
1,646 మంది కార్మికులకు ప్రయోజనం
గౌరవ వేతనం పెంపుతో వికారాబాద్ జిల్లాలో 1,646 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రయోజనం కలుగుతున్నది. జిల్లాలో 1,030 పాఠశాలలు ఉండగా 165 పాఠశాలల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుండగా, మిగిలిన 865 పాఠశాలల్లో స్థానికంగా ఎస్ఎంసీలు నియమించిన వంట ఏజెన్సీ మహిళలు పథకాన్ని అమలు చేస్తున్నారు. 25 మందిలోపు విద్యార్థులున్న బడిలో ఒక కుక్ కం హెల్పర్, 26 నుంచి వందలోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ఇద్దరు, ఆపై ప్రతి వంద మంది విద్యార్థులకు ఒకరు చొప్పున కుక్ కం హెల్పర్లను నియమించుకోవచ్చు. వీరు విద్యా సంవత్సరంలో 10 నెలలపాటు మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు వడ్డించాలి. వీరికి 2010 నుంచి ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.వెయ్యి అందజేస్తున్నది. చాలాకాలంగా వీరు చాలీచాలని వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వీరికిస్తున్న గౌరవ వేతనాన్ని ఒకేసారి పెంచి అందజేస్తున్నది.
వేతనం పెంచడం ఆనందంగా ఉంది
మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న కార్మికులకు వేతనం పెంచడం ఆనందంగా ఉంది. చాలా రోజుల నుంచి రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి రోజూ పాఠశాలకు ఉదయమే వచ్చి వంటలు చేసి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటున్నాం. మా కష్టాలను గుర్తించి సీఎం సార్ వేతనం పెంచినందుకు కృతజ్ఞతలు.
– సత్యమ్మ, మధ్మాహ్న భోజన కార్మికురాలు, దుద్యాల
ఇచ్చిన మాటను నిలుపుకున్న కేసీఆర్ సార్
మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచుతామని సీఎం సార్ నిరుడు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మాకు వేతనం రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. ఇన్నాళ్లు మా కష్టాలను ఎవరూ గుర్తించలేదు. వేతనం పెంచి సీఎం సార్ మాకు న్యాయం చేశారు.
–పద్మమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, దుద్యాల
సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు
వేతనం పెంచినందుకు కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. నెలకు రూ.వెయ్యి ఇస్తే ఏం సరిపోతవి. మేము అడగకున్నా మా బాధలు, మేము పడుతున్న కష్టం గుర్తించి కేసీఆర్ సార్ వేతనం పెంచారు. ఈ విధంగా గతంలో ఎవరూ చేయలేదు.
– లక్ష్మీబాయి, మధ్యాహ్న భోజన కార్మికురాలు, పూర్యానాయక్తండా