వికారాబాద్ జిల్లాలో ఆసరా పింఛన్దారుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 92,171 మందికి పింఛన్ అందుతుండగా.. కొత్తగా మరో 25,121 మందికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో మొత్తం జిల్లాలో 1,17,292 మందికి ప్రతి నెలా ఆసరా డబ్బులు అందనున్నాయి. అంతేకాకుండా డయాలసిస్ రోగులకు పింఛన్ అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరుగనున్నది. కొత్త పింఛన్దారులకు గుర్తింపుకార్డుల పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.
పరిగి, ఆగస్టు 24 : పేదవారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సర్కారు కొత్తగా మరింత మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. 57 ఏండ్లు నిండిన అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయడం ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పించారు. కొత్తగా వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 25,121 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 92,171 మందికి వివిధ రకాల పింఛన్ల కింద ప్రభుత్వం ప్రతి నెల రూ.21,63,71,584 అందజేస్తున్నది. అదనంగా 25,121 మందికి పింఛన్లు మంజూరవగా మొత్తం 1,17,292 మందికి పింఛన్లు అందనున్నాయి. ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఆసరా పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పింఛన్ల సంఖ్య మరింత పెరుగనుంది.
జిల్లాలో 92,171 మందికి రూ.21.63కోట్లు
జిల్లా పరిధిలో ఆగస్టు నెల వరకు 92,171 మందికి వివిధ రకాల పింఛన్లు ఇచ్చారు. దీంతో రూ.21,63,71,584 అందిస్తున్నారు. ఇందులో వృద్ధులు 28,311., వితంతువులు 45,635., దివ్యాంగులు 11,969., గీతకార్మికులు 424., చేనేత కార్మికులు 156, పైలేరియా వ్యాధిగ్రస్తులు 211., బీడీ కార్మికులు 39 మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇందులో దివ్యాంగులకు నెలకు రూ.3016, ఇతరులకు రూ.2016 అందిస్తున్నారు. జిల్లాలో కొత్తగా 25,121 పింఛన్లకు నెలకు రూ.5,06,43,936 అందించనున్నారు.
గ్రామాల్లో పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీ
జిల్లావ్యాప్తంగా నూతనంగా మంజూరైన 25,121 ఆసరా పింఛన్లకు సంబంధించిన గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్పటికే 1,056 మందికి కార్డులు అందించగా మిగతా 24,065 కార్డుల పంపిణీ బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గుర్తింపు కార్డులు అందజేస్తున్నారు. ఈ గుర్తింపు కార్డుల్లో లబ్ధిదారుల పేరు, వయస్సు, ఏ రకమైన పింఛన్ తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం ఉంటుంది. ఈ గుర్తింపుకార్డు ద్వారానే కొత్త పింఛన్దారులకు పింఛన్ డబ్బులు సంబంధిత గ్రామాల్లోని పోస్టాఫీసుల ద్వారా అందించనున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పోస్టాఫీసుల ద్వారా, మున్సిపాలిటీల్లో బ్యాంకుల ద్వారా పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. ఈ మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్తవారికి పింఛన్ అందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
25121 ఆసరా పింఛన్లు మంజూరు
– కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా
జిల్లా పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల్లో మొత్తం 25121 కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం గుర్తింపు కార్డులను కూడా జారీ చేసింది. గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతున్నది. ప్రతి లబ్ధిదారుకు గుర్తింపు కార్డులు అందనున్నాయి.
కేసీఆర్ సార్ ఇస్తాడన్న నమ్మకం ఉంది
– శేరి అనసూయ, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఎప్పటికైనా సీఎం సారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ఉండేది. అది నేడు నిజమైంది. పింఛన్ మంజూరు చేసినందుకు కేసీఆర్ సారుకు ధన్యవాదాలు. ఈ మేలును ఎన్నటికీ మరిచిపోను.
సంతోషంగా ఉంది : బోయిని వెంకటమ్మ, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందించి ప్రభుత్వం ఆదుకుంటున్నది. పింఛన్ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించారు. నాకు పింఛన్ మంజూరైనందుకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
పేదల ప్రభుత్వం : సాలీబాయి, బోట్లవానితండా, బొంరాస్పేట మండలం
కేసీఆర్ ప్రభుత్వం పేదలను ఆదుకుంటున్నది. వారికి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నారు. ఆసరా పింఛన్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆసరా పథకం ఎంతో మందికి మేలు చేస్తున్నది.