న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) తన ఆదేశాల్లో పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే మైనర్లను విడిచి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. కానీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని మాత్రమే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి తమ వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. వాళ్లు తమ వాదనలు వినిపించవచ్చు అని చెప్పింది. సీసీటీవీ ఫూటేజ్, డ్రోన్ రికార్డింగ్లు, వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఇతర రికార్డులకు చెందిన వీడియోలను దాచిపెట్టాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. పోలీసులు రికార్డు చేసిన నిరసనకారులకు చెందిన డిజిటల్ డేటాను ప్రజలకు చేరవేయవద్దు అని కోర్టు వెల్లడించింది.
నిరసనకారుల పర్సనల్ డేటా కానీ, వివరాలను కానీ పబ్లిష్ చేయవద్దు అని కోర్టు ఆదేశించింది. పెల్లెట్ గన్స్ వాడిన అంశంపై కూడా కోర్టు వాదనలు విన్నది. నేర చరిత్ర లేని విద్యార్థులను తక్షణమే రిలీజ్ చేయాలని కోర్టు పేర్కొన్నది. ఆగస్టు 3వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నారు. విద్యార్థులకు, పోలీసులకు జరిగిన గాయాల పట్ల నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని కోర్టు పేర్కొన్నది. దీని కోసం మాజీ జడ్జీ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.