కొత్తూరు, మే 18 : ఎనిమిదో విడుత హరిత పండుగకు కొత్తూరు మండలం సమాయత్త మవుతుంది. ఏడు విడుతల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటిన మండలం మరో హరిత పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కొత్తూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వివిరిగా మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలను రూపొందించారు. ముఖ్యంగా ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంతో పాటు మున్సిపాలిటీలో కూడా ఈ ఏడాది కొత్తగా రెండు నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు.
నాటడానికి సిద్ధంగా 2. 16 లక్షల మొక్కలు
మండలంలోని అన్ని గ్రామాల్లో ఎనిమిదో విడుత హరితహారానికి నర్సరీల్లో 2.16 లక్షల మొక్క లు పెంచుతున్నారు. మండ ల పరిధిలోని గూడురు నర్సరీలో 18 వేలు, కొడిచెర్లలో 21 వేలు, మల్లాపూర్లో 19 వేలు, పెంజర్లలో 21 వేలు, ఎస్బీపల్లిలో 12 వేలు, సిద్ధాపూర్లో 22 వేలు, తీగాపూర్లో 18 వేలు, ఇన్ముల్నర్వలో 21 వేలు, మక్తగూడలో 13 వేలు, మల్లాపూర్ తండాలో 18 వేలు, కొడిచర్ల తండాలో 18 వేలు, ఏనుగుమడుగు తండా నర్సరీలో 14 వేల మొక్కలు పెంచుతున్నారు.
మున్సిపాలిటీలో 5,900 మొక్కలు
కొత్తూరు మున్సిపాలిటీలో రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. అందులో గుడ్విల్ వెంచర్లోని 10 శాతం ల్యాండ్లో 19 వేల మొక్కలు పెంచుతున్నారు. అలాగే గోపాల్ రెడ్డి వెంచర్లోని 10 శాతం భూమిలో 4000 మొక్కలు పెంచుతున్నారు.
యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం
మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ముఖ్యంగా మొక్క లు ఎక్కడ నాటాలో స్థలాలను గుర్తిస్తున్నాం. అలాగే ఎన్ని మొక్కలు రీప్లేస్ చేయాలనే దానిపై సర్వే నిర్వహిస్తున్నాం. మండలంలో ఇప్పటి వరకు నాటిన మొక్కలు అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా మొక్కలు నాటాలంటే స్థలాలను గుర్తించాలి. పల్లెప్రగతి లో భాగంగా మొక్కలు ఎక్కడెక్కడ నాటోలో గుర్తించి వర్షాకాలం వరకు అన్ని సిద్ధం చేస్తాం.
– శరత్చంద్రబాబు, ఎంపీడీవో, కొత్తూరు.