ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇందుకోసం రూ.వందల కోట్లతో రోడ్ల మరమ్మతులు, నూతన రహదారులు, నదులు, వాగులపై వంతెనలు నిర్మిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో గత తొమ్మిదేండ్లుగా వంతెనల నిర్మాణానికి రూ.130 కోట్లకుపైగా నిధులను వెచ్చించింది. జిల్లాలోని మూసీ, కాగ్నా నదులు, ఈసీ వాగుతోపాటు మారుమూల పల్లెల్లోని వాగులపై కూడా బ్రిడ్జిలను నిర్మించి ప్రజల మన్ననలు పొందుతున్నది. 2014 నుంచి 2022 వరకు జిల్లాలో 25 వంతెనల నిర్మాణం కోసం రూ.123.36 కోట్ల నిధులను ఖర్చు చేసింది. అంతేకాకుండా కొత్తగా మరో ఆరు వంతెనలను మంజూరు చేసిన సర్కార్.. రూ.18.78 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. గతంలో వానకాలం వస్తే చాలు, వాగులు పొంగిపొర్లి రహదారులు కొట్టుకుపోయే దుస్థితి ఉండేది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి ప్రజలు నరకయాతన అనుభవించేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున బ్రిడ్జిలను నిర్మించడం, రహదారులను మెరుగుపరుస్తుండడంతో ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతున్నాయి.
-వికారాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ప్రజా రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత తొమ్మిదేండ్లలో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకుగాను రూ.వందల కోట్ల నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీల వరకు లింక్ రోడ్లను నిర్మించారు. రహదారుల నిర్మాణంతోపాటు వంతెనల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చించింది. గతంలో వానకాలం వస్తే చాలు, వాగులు పొంగిపొర్లి రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొని ఉండేది.
వరదలతో రహదారులు కొట్టుకుపోయి గ్రామాల మధ్య వారం, పది రోజులు రవాణా స్తంభించే దయనీయ పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రవాణా స్తంభించే ప్రాంతాలను గుర్తించి సంబంధిత గ్రామాల్లో వంతెనలు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చింది. జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా నదులతోపాటు ఈసీ వాగు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వాగులు, మారుమూల పల్లెల్లోని వాగులపై కూడా రూ.కోట్లు ఖర్చు చేసి బ్రిడ్జిలను నిర్మించడంతో ప్రజలకు కష్టాలు తప్పి రవాణా సాఫీగా జరుగుతుండడం గమనార్హం.
రూ.142 కోట్లతో 31 వంతెనల నిర్మాణం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మారుమూల పల్లెల్లో కూడా వాగులపై వంతెనలను నిర్మించి గ్రామాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ప్రధానంగా జిల్లాలోని కాగ్నా నది పరీవాహక ప్రాంతంలో వంతెనల నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులను వెచ్చించింది. కాగ్నా నదిపై జీవన్గి వద్ద బషీరాబాద్ నుంచి కరన్కట్ వెళ్లే దారిలో రూ.13.40 కోట్లతో వంతెనను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.16.80 కోట్లతో మహబూబ్నగర్-చించోలి రోడ్డులో, రూ.15.30 కోట్లతో వికారాబాద్-తాండూరు వెళ్లే దారిలో, రూ.12 కోట్లతో శంకర్పల్లి-మర్పల్లి దారిలో, మర్పల్లి-బుదేరా వెళ్లే దారిలో రెండు వంతెనలను, రూ.5.50 కోట్లతో వికారాబాద్-తంగేడ్పల్లి వెళ్లే దారిలో, రూ.6.70 కోట్లతో పరిగి-నంచర్ల రోడ్డులో వంతెనలను, రూ.3.50 కోట్లతో హైదరాబాద్-బీజాపూర్ వెళ్లే దారిలో హైలెవెల్ వంతెనను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
తాండూరు-ధారూరు దారిలో రూ.4.70 కోట్లతో, చిట్టంపల్లి-లాల్పహాడ్ మధ్య రూ.5.25 కోట్లతో, తాండూరు సిల్వర్ రోడ్డులో రూ.3 కోట్లతో, రూ.8.90 కోట్లతో తాండూరు-కోట్పల్లి రోడ్డులో ప్రధానంగా వంతెనలను నిర్మించారు. 2014 నుంచి 2022 వరకు జిల్లాకు 25 వంతెనలను ప్రభుత్వం మంజూరు చేయగా.. రూ.123.36 కోట్ల నిధులను ఖర్చు చేసింది. సంబంధిత బ్రిడ్జిల్లో ఇప్పటివరకు దోర్నాల, మర్పల్లి వద్ద రెండు వంతెనల నిర్మాణం పెండింగ్లో ఉండగా, సంబంధిత బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా మరో రెండు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కొత్తగా 6 వంతెనలు మంజూరు
జిల్లాకు కొత్తగా ఆరు వంతెనలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గానికి 3, పరిగి నియోజకవర్గానికి 2 వంతెనలు, తాండూరు నియోజకవర్గానికి ఒక వంతెనను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాకు మంజూరైన 6 వంతెనల నిర్మాణానికి రూ.18.78 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వికారాబాద్ నియోజకవర్గంలో రూ.1.65 కోట్లతో అంతగిరిపల్లి-మోత్కుపల్లి రోడ్డులో, రూ.1.85 కోట్లతో ధారూరు రైల్వే స్టేషన్ దారిలో వంతెనల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాగా, త్వరలో పనులు ప్రారంభించనున్నారు. రూ.1.30 కోట్లతో వికారాబాద్-కెరెళ్లి వెళ్లే రెండు కల్వర్టులను నిర్మించనున్నారు.
పరిగి నియోజకవర్గంలో రూ.2.98 కోట్లతో షాద్నగర్-పరిగి రోడ్డులో, రూ.3 కోట్లతో చిట్టంపల్లి-లాల్పహాడ్ రోడ్డులో వంతెనల నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించి, పనులను ప్రారంభించనున్నారు. తాండూరు నియోజకవర్గంలోని గౌతాపూర్-కరన్కోట్ మధ్యలో హైలెవెల్ వంతెన నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు షురూ చేయనున్నారు.