Maganuru | మాగనూరు, ఆగస్టు 11: నారాయణపేట జిల్లా మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు శివారులో పట్టపగలే భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్స్కవేటర్లతో మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి తవ్వకాలకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? తవ్విన మట్టిని తరలించేందుకు రవాణా అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. మైనర్ మినరల్స్ తవ్వకం, రవాణా, అక్రమ క్వారీయింగ్ను అరికట్టాల్సిన బాధ్యత మైనింగ్ శాఖపై ఉందని వారు గుర్తుచేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్స్కవేటర్లు, టిప్పర్లు తిరుగుతుండటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండానే ఇంత బహిరంగంగా తవ్వకాలు ఎలా కొనసాగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.
అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడితే భూమి స్వరూపం దెబ్బతినడంతోపాటు భారీ గోతులు ఏర్పడి వర్షాకాలంలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణంపై పడే ప్రభావాన్ని కూడా అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? అనే విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులను వివరణ కోరగా.. ప్రస్తుతం మూడు రోజుల సెలవులు ఉన్నాయని, ఇప్పటివరకు ఎవరికీ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో నల్లగట్టు శివారులో జరుగుతున్న తవ్వకాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.