బంట్వారం, నవంబర్ 25 : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజల చెంతకే పరిపాలన సౌలభ్యాన్ని అందించాలని గూడెలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నో పల్లెలు స్వయం పాలనతో అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెల అభివృద్ధి రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామం, తొరుమామిడి గ్రామానికి అనుబంధంగా ఉండేది.
నూతన పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. 337 కుటుంబాలు, 1315 జనాభా, 1144 ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో అధిక శాతం జనం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వందకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పంచాయతీకి సొంత భవనం లేక ప్రభుత్వ పాఠశాలలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నూతన పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేసిందని, పనులు శరవేగంగా సాగుతున్నాయని సర్పంచ్ తలారి నర్సింలు పేర్కొన్నారు.
బస్వాపూర్ గ్రామంలో రూ.80 లక్షల నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవనం, రూ.85 వేలతో డ్రైనేజీ నిర్మాణం, రూ.5 లక్షలతో ఫార్మేషన్ రోడ్డు, రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ. 50 వేల తో డంపింగ్ యార్డు, రూ.2.5 లక్షలతో కంపోస్టు షెడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామం చుట్టూ ఉన్న కందకాన్ని రూ.5 లక్షల నిధులను వెచ్చించి పూడ్చి వేయడంతో గ్రామం సర్వాంగ సుందరంగా మారింది.
నూతన పంచాయతీ ఏర్పాటుతో పల్లె బాగుపడింది. పల్లె ప్రగతి, నెలనెలా వచ్చే ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పార్కులను నిర్మించారు. ఇదివరకు ఏ అవసరమొచ్చినా తొరుమామిడికి పోతుంటిమి. ఇప్పుడు ఆ ఇబ్బందులు తప్పాయి.
– నరేశ్, బస్వపూర్ గ్రామస్తుడు
ఎమ్మెల్యే, గ్రామస్తులు, పంచాయతీ పాలకుల సహకారంతో మరింత గ్రామాభివృద్ధికి కృషి చేస్తా. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, మురుగు కాల్వలను నిర్మించుకున్నాం. ఏ సమస్య ఉన్నా పంచాయతీలో తీర్మానం చేసి పరిష్కరించుకుంటున్నాం. – తలారి నర్సింలు, బస్వపూర్ సర్పంచ్