కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం గీతకార్మికుల కుటుంబాలను ఆపదలో ఆదుకునేందుకు సిద్ధమైంది. అందుకోసం రైతుబీమా తరహాలో గీతకార్మికులకూ బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కార్మికులు ప్రాణాలు కోల్పోతుండడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడై ‘బీమా’ అమలుకు అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని అందజేయాలని నిర్ణయించగా.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని లక్షలాదిగా గౌడ కుటుంబాలకు మేలు జరుగనున్నది. బీమా సౌకర్యంపై గౌడ కులస్తులు, గౌడ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వయోధిక కల్లు గీత కార్మికులకు నెలకు రూ.2,016 చొప్పున ‘ఆసరా’ పింఛన్ సైతం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 2,449 మంది కార్మికులకు పింఛను అందుతున్నది.
రంగారెడ్డి, మే 3 (నమస్తే తెలంగాణ) : పొరుగువారి పాలనలో దగాపడ్డ తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా అన్ని రకాలుగా చికిత్స అందిస్తున్నది. కోల్పోయిన ప్రతి రంగాన్ని ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వాధినేతలు బాగుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సీఎం కేసీఆర్ సమాజోద్ధరణకు పూనుకున్నారు. అందులో భాగంగానే కుల వృత్తులకు జీవం పోస్తున్నారు. దళిత కుటుంబాలు, గొల్లకురుమలు, బ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, చేనేత, బెస్త/ముదిరాజ్, వెనుకబడిన కుటుంబాలు, ఇంకా మైనార్టీలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటూ వారి బతుకులకు భరోసా కల్పిస్తున్నది. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని విధంగా అనేక వృత్తులకు చేయూతనిస్తూ మరుగునపడుతున్న పలు వృత్తులను తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నది. వెనుకబడిన పలు సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక సంక్షేమ పథకాలను అందుబాటులో తీసుకొస్తూ వారి ఆర్థికపరమైన అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఇప్పుడు గౌడ కులస్తుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు సన్నద్ధమైంది. రాష్ట్రం అంతటా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా బీమాను అమలు చేస్తున్నది. ఇదేవిధంగా గీత కార్మికులకు కూడా ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించి ‘బీమా’ను అమలు చేసేందుకు అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో జిల్లాలోని గౌడ కులస్తులు, గౌడ ఐక్య సాధన సమితి, కల్లుగీత కార్మిక సంఘం, గీత పనివారల సంఘం, గౌడ జన హక్కుల పోరాట సమితి, గౌడ కల్లు గీత వృత్తిదారుల సంఘం, గౌడ సమన్వయ కమిటీ, జై గౌడ్ ఉద్యమ సంఘాలు, ఇంకా పలు వేదికలన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాయి. కుల వృత్తులకు జీవం పోస్తున్న మనసున్న మారాజు కేసీఆర్ అని గౌడ కులస్తులు ఏకకంఠంతో జిల్లావ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేశారు.
గత పాలకుల హయాంలో తెలంగాణ దోపిడీకి గురైంది. దోపిడీదారుల పాలన అంతమొంది, నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమాజోద్ధరణకు పునాది పడింది. ఈ నేపథ్యంలోనే కుల వృత్తులను బతికించుకుంటున్నం. అందులో భాగంగానే వయోధిక కల్లు గీత కార్మికులకు నెలకు రూ.2,016 చొప్పున ‘ఆసరా’ పింఛన్ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. నెలకు రంగారెడ్డి జిల్లాలో 2,449 మందికి రూ.49,37,184లను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది. మరణించిన కల్లు గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదనే నేపథ్యంలో ‘కల్లు గీత కార్మికులకు రూ.5 లక్షల బీమా’ను అందిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఎక్స్గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమవుతున్నందున ఈ పథకానికి కార్యాచరణ జరిగింది. కల్లు గీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని లక్షలాదిగా ఉన్న గౌడ కుటుంబాల బతుకులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భరోసాను కల్పిస్తున్నది. యజమానిని కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమాయత్తమైంది. పలువురు గౌడ కులస్తులు, సంఘాలు, వేదికల వారు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వేనోళ్ల కొనియాడుతున్నాయి.
– రవి గౌడ్, షాద్నగర్
అన్ని వర్గాల సంక్షేమానికి సర్కారు ఎంతో కృషి చేస్తున్నది. గౌడ కులస్తుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కార్యాచరణ చేయడం, అభివృద్ధికి చేయూతను ఇవ్వడం, పురోగతి దిశగా అడుగులు వేస్తున్నది. గౌడ కులస్తుల అభివృద్ధికి, కుటుంబాలకు భరోసానిచ్చేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది.
గీత కార్మికుల అభివృద్ధికి సీఎం తీసుకున్న బీమా నిర్ణయం గొప్పది. చరిత్రాత్మకమైనది. ఈ బీమాతో సీఎం కేసీఆర్ గౌడ కుటుంబాలకు భరోసా కల్పించారు. రైతు బీమా మాదిరిగా ఎటువంటి పైరవీలు లేకుండా గీత కార్మికుడు చనిపోతే వారంలోపు ఆ బీమా అమౌంట్ రూ.5 లక్షలు అకౌంట్లో జమ కావడం గొప్ప నిర్ణయం.
– పాలమాకుల పెంటయ్యగౌడ్, గౌడ సంఘం నాయకుడు, నందిగామ
సమైక్య పాలనలో గీత కార్మికులను పట్టించుకున్న నాథుడే లేడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రధానంగా కుల వృత్తులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన్రు. వయోధిక కల్లు గీత కార్మికులకు ఇప్పటికే ప్రాధాన్యత ఇస్తూ పింఛన్లను అందిస్తున్నారు. దీంతోపాటు రూ.5 లక్షల బీమా అందించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు గీత కార్మికులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటరు. నిరుపేదల జీవన స్థితిగతులు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. ఆయన మేలు ఎప్పటికీ మరువం.
– వెంకటయ్యగౌడ్, నల్లచెరువు, మాడ్గుల
కుల వృత్తుల పునరుద్ధరణ సామాజిక పురోగతికి అద్దం పడుతున్నది. ప్రభుత్వ తీరు తెన్నులను ప్రపంచానికి చాటుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో గౌడ కుల అభ్యున్నతికి రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించడం గొప్ప పరిణామం. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి.
– లాలయ్యగౌడ్, మాడ్గుల
గౌడ జాతి అభివృద్ధికి సీఎం కేసీఆర్ సార్ ఎంతో కృషి చేస్తున్నారు. వయసు మీద పడ్డ గీత కార్మికులకు నెలకు రూ.2,016 పింఛన్ ఇస్తున్నరు. ‘బీమా’ పథకం గౌడన్నల కుటుంబానికి భరోసాగా నిలుస్తది. గౌండ్లు జంకూబొంకూ లేకుండా కుల వృత్తిని చేపట్టొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సారు చల్లని చూపు ఉన్నంత కాలం కుల వృత్తుల మనుగడకు ఢోకా లేదు.
– కెప్టెన్ అంజన్గౌడ్, విద్యావేత్త, ప్రభుత్వ
కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, అంతారం
సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి సమన్యాయం జరుగుతున్నది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినా ఏ ప్రభుత్వమూ గీత కార్మికులను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గీత కార్మికుల శ్రమను గుర్తించి రూ.5 లక్షల బీమాను అమలు చేయడం చరిత్రలో నిలిచే అంశమని చెప్పొచ్చు.
– అశోక్గౌడ్, గౌడ సంఘం నేత, శంకర్పల్లి
గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల బీమా అందించడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు పింఛన్లు అందిస్తూ, వారికి అండగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో నీరా కేఫ్ను ప్రారంభించడం ద్వారా గౌడ కులస్తులకు జీవనోపాధి లభిస్తున్నది.
– జి.జగదీశ్వర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్, కొత్తపేట, కేశంపేట మండలం
కల్లుగీత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో వారికి న్యాయం చేకూరుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయడం చాలా మంచి నిర్ణయం. రాష్ట్రంలోని లక్షలాది మంది కల్లు గీత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎంతో మంది గీత కార్మికులు ఈత, తాటి చెట్లపై తమ వృత్తి పనులు నిర్వహిస్తూ కిందపడి చనిపోయారు. ఇక మీదట గీత కార్మికులు చెట్లపై నుంచి పడి చనిపోతే వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో కేసీఆర్ సార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గీత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భేష్.
– మెట్టు నారయ్యగౌడ్, నల్లచెరువు, మాడ్గుల
గౌడ్ జాతి కులస్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సారు కృషి మరువలేనిది. చెట్లెక్కి కల్లు గీత కార్మికులు పై నుంచి కిందపడి ఎంతో మంది చనిపోతున్నరు. అటువంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ సారు ‘గౌడ బీమా’ పథకాన్ని తీసుకురావడం చాలా సంతోషకరం. ఇంటి పెద్ద చనిపోతే.. ఈ పథకం ఆ కుటుంబాన్ని కొన్నేండ్లపాటు ఆదుకుంటుంది. బతుకును కోల్పోయిన కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నది.
– పరిగి గణేష్గౌడ్, గౌడ సంఘం నాయకుడు
గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేయడం సంతోషంగా ఉంది. గీత కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడం గొప్ప పరిణామం. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కుల సంఘాలన్నింటికీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఎంతో మేలు జరుగుతున్నది.
– వి.లక్ష్మీనారాయణగౌడ్, గౌడ సంఘం నాయకుడు, కేశంపేట
సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాల్లో గౌడ కులస్తులకు అందించనున్న ఈ పథకం ఎంతో ఉత్తమం, ఉన్నతమైనది. చెట్లను నమ్ముకొని జీవిస్తున్న గీత కార్మికులు పొరపాటున జీవి ఇడిస్తే.. ఆ కుటుంబాన్ని ఆదుకునేదెవరు? ఇంటి యజమాని చెట్లు ఎక్కుతూ పోతే.. ఆ బాధ ఎట్లుంటదో ఆలోచించి ఎంతో మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నరు.
– శమల నిరంజన్గౌడ్, దొడ్లపహాడ్
రైతు బీమా మాదిరిగా గీత కార్మికులకు ‘గీత బీమా’ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. దేశంలో కుల వృత్తులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వారిని ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు.