వికారాబాద్, ఏప్రిల్ 4, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికితోడు నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గడిచిన ఎనిమిదేండ్లలో వికారాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3.31 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014 సంవత్సరంలో వికారాబాద్ జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా, 2016లో 2.99 లక్షల ఎకరాలు, 2022 వానకాలంలో 5,81,464 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం. జిల్లాలో అధికంగా కందులు, పత్తి, వరి పంటలు సాగయ్యాయి. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తూ రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది.
రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ సర్కారు ఈ ఎనిమిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలయ్యిందనే విధంగా వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. రూ.లక్ష రుణమాఫీని చేసిన ప్రభుత్వం.. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా మొదటి విడుతగా రూ.47 వేలలోపు రుణాలకు సంబంధించి రూ.60 కోట్లను మాఫీ చేసింది.
మరోవైపు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయమందించేందుకు రైతు బంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని రైతాంగానికి రూ.2400 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. ఏదేని రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 4262 మంది రైతులు మరణించగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.213 కోట్లను అందజేసింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలోని 790 చెరువుల్లో పునరుద్ధరణ పనులను చేపట్టడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయి.
ఎనిమిదేండ్లలో 3.31 లక్షల ఎకరాల్లో పెరిగిన విస్తీర్ణం
సర్కారు వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతతో జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఎనిమిదేండ్లలో 3.31 లక్షల ఎకరాల్లో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014లో జిల్లాలో 2.50 లక్షల ఎకరాలు, 2016లో 2.99 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 2022 వానాకాలం సీజన్ వరకు జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం 5,81,464 ఎకరాలకు పెరగడం గమనార్హం. ప్రధానంగా పత్తి పంటతోపాటు కంది, వరి, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 2016తో పోలిస్తే జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 1,53,310 ఎకరాలు, వరి సాగు విస్తీర్ణం 1,04,658 ఎకరాలకు, కంది సాగు విస్తీర్ణం 20 వేల మేర సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రతి ఏటా ఆయా పంటల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల వరకు పెరుగుతూ వస్తున్నది. కబ్జాలకు గురైన చెరువులు, నామరూపాల్లేకుండా పోయిన చెరువులకు సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయతో తిరిగి జీవం పోయడంతో చెరువులు, బోర్లలో కూడా నీటి నిల్వలు కూడా భారీగా పెరగడం గమనార్హం. 24గంటల నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టడం తదితరాలతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కులకచర్ల, దోమ, బొంరాస్పేట్, దౌల్తాబాద్, యాలాల, బషీరాబాద్, పూడూరు మండలాల్లో ఆయా పంటల సాగు గణనీయంగా పెరిగింది.