రంగారెడ్డి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : జిల్లా పరిధిలోని బండరావిరాలలో ప్రభుత్వం కొత్తగా ఏకో పార్కు ఏర్పాటు చేయాలని జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 494 ఎకరాల్లో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించింది. గతేడాది సీఎం రేవంత్రెడ్డి జపాన్లో పర్యటించినప్పుడు కిటక్యూషు నగరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలపై అధ్యయనం చేశారు.
ఇలాంటి కార్యక్రమాన్ని తెలంగాణలోనూ చేపట్టాలని జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ కుదిరిందే తడువుగా బండరావిరాల సమీపంలోని సర్వేనంబర్ 268లో గల ప్రభుత్వ భూమి 494 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు. మంత్రివర్గంలోనూ ఆమోదం తెలిపారు. ఔటర్రింగ్రోడ్డుకు అతి సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ఈ డంపింగ్యార్డును ఏర్పాటు చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పరిసర గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమావేశాలు నిర్వహించి డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా ముందుకు కదులుతున్నారు.
బండరావిరాల పరిసర గ్రామాల ప్రజలు ఇప్పటికే క్రషర్ మిషన్ల ద్వారా వచ్చే దుమ్మూధూళితోపాటు వాయి కాలు ష్యం, మరోవైపు బ్లాస్టింగ్లతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడి నుంచి క్రషర్ మిషన్లను ఎత్తివేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండగా.. కొత్తగా ప్రభుత్వం డంపింగ్యార్డు సమస్యను తీసుకొచ్చి తమ నెత్తిన రుద్దుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే చెత్తాచెదారాన్ని ఇక్కడకు తీసుకొచ్చి డంపింగ్ చేసేందుకు జపాన్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకోవటంపై ఈ ప్రాంత ప్రజలను రుసరుసలాడుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే.. ప్రజలు రోగాలబారిన పడతారని.. తమ ప్రాం తంలో డంపింగ్ యార్డు వద్దే.. వద్దు అని స్థానికులు ప్రజాప్రతినిధులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

హైదరాబాద్ శివారులోని ఓఆర్ఆర్ పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని జపాన్ ప్రభుత్వానికి కేటాయించటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి విలువ మార్కెట్లో సుమారు రూ.10వేల కోట్లకు పైగానే ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం జిల్లాలోని ముచ్చర్ల సమీపంలో పొల్యూషన్ రహిత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామంటే గగ్గోలు పెట్టిన కాంగ్రె స్ నాయకులు ఫార్మాసిటీ కంటే అత్యంత ప్రమాదకరమైన డంపింగ్యార్డును ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజ లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమల వంటి వాటికి ఆ స్థలాన్ని కేటాయించాలని సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. కాగా, రూ.10వేల కోట్లకుపైగా విలువ చేసే భూమిని జపాన్ సర్కార్కు కేటాయించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బండరావిరాల సర్వేనంబర్ 268లో ఏర్పాటు చేసే డంపింగ్యార్డుతో జిల్లాలోని సద్దుపల్లి, బండరావిరాల, చిన్నరావిరాల, తారామతిపేటతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, జూలురు, పెద్దగూడం, దేశ్ముఖి, గువ్వలేటితోపాటు మరికొన్ని గ్రామాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. దీంతో ఈ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇక్కడ డంపింగ్యార్డును ఏర్పాటు చేయొద్దని పోరాటానికి సిద్ధమయ్యారు. రాజకీయాలకతీతంగా బండరావిరాల, చిన్నరావిరాల, పిలాయిపల్లి, దేశ్ముఖి, బలిజగూడ, జగత్పల్లి సర్పంచ్లు విజయ్, బాలకిషన్, మహాలక్ష్మి, జంగయ్య, మాధవి, మహేశ్తోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు ఇటీవల గువ్వలేటిలో సమావేశమయ్యారు. ఇందులో డంపింగ్యార్డును ఏర్పాటు చేయొద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు.
బండరావిరాల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని మైనింగ్జోన్కు అప్పగించి అనేక క్రషర్ మిషన్లను ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున దుమ్మూధూళి వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని బండరావిరాల, చిన్నరావిరాల, గువ్వలేటి, సద్దుపల్లి, కవాడిపల్లి వంటి గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. మైనింగ్జోన్ను ఎత్తేసి క్రషర్ మిషన్లను తొలగించాలని చేస్తున్న పోరాటంతో ఇప్పటికే కొన్ని క్రషర్ల మిషన్ల లీజులను ప్రభు త్వం రద్దుచేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మూడు క్రషర్ మిషన్లు మాత్రమే కోర్టు అనుమతితో నడుస్తున్నాయి. వాటినీ అక్కడి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు న్నా.. పట్టించుకోకుండా కొత్తగా డంపింగ్యా ర్డు సమస్యను తీసుకొచ్చి తమకు అంటగట్టే యత్నం చేస్తున్నదని మండిపడుతున్నారు.