రంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో సోమవారం నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ముందుగా ఆయన తుమ్మలూరు వద్ద ఉన్న అర్బన్ ఫారెస్ట్ వద్దకు చేరుకుని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మ్యాక్ ప్రాజెక్టు పక్కనే ఉన్న మైదానంలో జరిగిన హరితోత్సవ సభలో మాట్లాడారు. త్వరలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించడంతోపాటు మహేశ్వరం, బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైలును విస్తరిస్తామని హామీఇచ్చారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని 65 గ్రామపంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ నిమిత్తం వెంటనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తామన్నారు. వీటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో రూ.25కోట్లు.. బడంగ్పేట, మీర్పేట కార్పొరేషన్ ము న్సిపాలిటీలకు రూ.50కోట్ల చొప్పున (మొత్తంగా రూ.11.25 కోట్లు) మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించారు. మహేశ్వరానికి మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు తుమ్మలూరులో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ.కోటి మంజూ రు చేయనున్నట్లు తెలిపారు. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్న ఈ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరాగా.. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ను నింపింది.
కాగా సభలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం కేసీఆర్కు పలు విజ్ఞప్తులు చేశారు. దీనికి స్పందిం చిన సీఎం..ఇంటి ఆడబిడ్డగా సబితాఇంద్రారెడ్డి అడిగినవన్నీ ఇవ్సాల్సిందేనని పేర్కొంటూ..అదనంగా మరిన్ని హామీలు, వరాలు ఇచ్చి అం దరినీ ఆశ్చర్యపర్చారు. తుమ్మలూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..దశాబ్ది ఉత్సవాలకు గుర్తుగా ఆ కమ్యూనిటీహాల్కు ‘దశాబ్ది కమ్యూనిటీ హాల్’ పేరు పెట్టాల్సిందిగా సూచించారు. తుమ్మలూరులో విల్లాలు విస్తారంగా ఏర్పాటవుతున్న దృష్ట్యా కరెంటు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సబ్స్టేషన్ను మంజూరు చేస్తున్నట్లు సభావేదికగా ప్రకటించారు.
కిక్కిరిసిన సభా ప్రాంగణం
హరితోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రావడంతో సభాప్రాంగణం కిక్కిరిసింది. ఎటూ చూసినా గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. సభా ప్రాంగణంలోనూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్లకార్డులను పార్టీ శ్రేణులు ప్రదర్శించారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో సభా ప్రాంగణం ఈలలతో మార్మోగింది. ఈ సందర్భం గా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఐఎఫ్ఎస్ రాకేశ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎఫ్వో సుధాకర్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, కాలె యాదయ్య, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశ్, గ్రం థాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్, తుమ్మలూరు సర్పం చ్ సురేఖాకరుణాకర్రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, రత్నం, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, మీర్పేట మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, తుకుగూడ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, ఎంపీడీవో నర్సింహు లు, చంద్రయ్య, అంజయ్యముదిరాజ్, సురేందర్రెడ్డి, యాదయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీఎం పర్యటన సాగిందిలా..
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన తెలంగాణ హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి మొక్కను నాటిన సీఎం కొద్దిసేపు రిజర్వ్ ఫారెస్టులో పర్యటించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ గ్రామాలు, పట్టణాల్లో హరిత ప్రగతిని తెలిపే ఫొటోలు, నివేదికలను సీఎంకు చూపించి వివరించారు. మొక్కల సంరక్షణకు సంబంధించిన అంశాలను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి భూపాల్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ సీఎం కేసీఆర్కు వివరించారు. అనంతరం అక్కడే మహాగని రకానికి చెందిన మొక్కను మం త్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం నాటారు.
త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి నుంచి నీళ్లు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగునీరు అందిం చే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరంతోపాటు పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండేదని.. కానీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పుణ్యాత్ములు కోర్టులకెళ్లి అడ్డుకున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. రిజర్వాయర్లు పూర్తయ్యాయని ఆగస్టులో వాటిని నీటితో నింపుకోబోతున్నామని తెలిపారు. టెండర్లు పూర్తై కాలువ పనులను కూడా పూర్తి చేసుకుని త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల ద్వారా మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాంతాలకూ గోదావరి నీటిని అందించే విషయమై చర్చ జరుగుతున్నదన్నారు. గోదావరి నీళ్లు గండిపేట, హిమాయత్సాగర్ వరకు లింక్ కాబోతున్నాయని, అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఇక్కడి ప్రాంతాలకు నీటిని తరలించొచ్చన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు.. సాగర్ నుంచి మూసీనది నీళ్లను దాటిస్తే గోదావరి నీళ్లు లోయపల్లి వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లోనే మార్పును చూడబోతున్నారని సభావేదికగా ప్రకటించారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్
ఇబ్రహీంపట్నం : హరితహారంలో భాగంగా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అంచనాలకు మించి ప్రజలు హాజరయ్యారు. సభ సక్సెస్ కావడంతో మంత్రి సబితాఇంద్రారెడ్డి కృషి ఫలించింది. సీఎం పర్యటన రెండు రోజుల ముందే ఖరారు కాగా..మంత్రి ప్ర త్యేక చొరవతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతోపాటు జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు, బడంగ్పేట, మీర్పేట కార్పొరేషన్ల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సం ఖ్యలో తరలిరావడంతో తుమ్మలూరు గేటు సమీపంలోని మ్యాక్ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన బహిరంగ సభాస్థలి నిండిపోయింది.
నెల రోజుల వ్యవధిలో రెండోసారి..
సీఎం కేసీఆర్ నెల రోజుల వ్యవధిలో జిల్లాకు రెండోసారి విచ్చేశారు. గతనెల 28న ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ దశదిన కర్మకు హాజరయ్యారు. కాగా సోమవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు మహేశ్వరం నియోజకవర్గంలో పాల్గొని జిల్లాపై అనేక వరాలు కురిపించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నిండింది.
కడ్తాల్ సర్పంచ్కు సీఎం ప్రశంసలు
కడ్తాల్, జూన్ 19 : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కందుకూ రు మండలంలోని తుమ్మలూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ నుంచి కడ్తాల్ సర్పంచ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఉహించని విధంగా ప్రశంసలు అందుకున్నారు. గ్రామంలో పెండ్లి చేసుకున్న నూతన దంపతులు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలంటే కచ్చితంగా రెండు మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని అమలు చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్న విషయాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్కుమార్ ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్ లక్ష్మీనర్సింహారెడ్డితోపాటు గ్రామ పాలకవర్గాన్ని అభినందించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదించాలి
మిషన్ భగీరథతో ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలు తీరా యి. చెరువులను బాగు చేయడంతో ఎండాకాలంలోనూ చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నా యి. శాంతిభద్రతల సమస్య లేకపోవడంతో రాష్ర్టానికి, ఉమ్మడి జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నా యి. దశాబ్ది ఉత్సవాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయి. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలి. – సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
యజ్ఞంలా సాగుతున్న హరితహారం
2015 నుంచి సీఎం మార్గదర్శకంలో కొనసాగుతున్న హరితహారం కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగు తు న్నది. ఒకప్పుడు బీడు భూములతో నెర్రలు బారిన తెలంగాణ ..నేడు పచ్చని పల్లెలతో స్వాగతం పలుకుతున్నది. మన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నా యి. అలాగే.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
-ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి
ఈ ఏడాది 19 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమివ్వడంతోనే ప్రతిఏటా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నది. హరితహారంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 273 కోట్లకు పైగా మొక్కలను నాటాం. ఇందుకు రూ.10,886 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఈ ఏడాది 19 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– శాంతి కుమారి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి