షాద్నగర్, జూన్19 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనమందరం మొక్కలను పెంచడం బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల, షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటి మాట్లాడారు. భూమిపై అడవుల శాతాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని, అందుకు అన్ని వర్గాల ప్రజలు అనువుగా ఉన్న ప్రతిచోట మొక్కలను పెంచాలని కోరారు. సీఎం కేసీఆర్ దృఢసంకల్పంతో చేపట్టిన హరితహారానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడం సంతోషకరమని అన్నారు.
విద్యార్థి దశనుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకొని కాలుష్యాన్ని నిర్మూలించడానకి చొరవ తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని అన్నారు. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో హరితహారాన్ని నిర్వహించారు. కొత్తూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ బాతుక లావణ్య, కేశంపేటలో ఎంపీపీ రవీందర్యాదవ్, నందిగామ మండలంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, ఫరూఖ్నగర్ మండలంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, షాద్నగర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో వ్యవసాయ సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పచ్చదనాన్ని పెంచి భావితరాలకు భవిష్యత్నిద్దాం
మొయినాబాద్ : పచ్చదనాన్ని పెంచి భావితరాలకు భవిషత్నిద్దామని, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని చిలుకూరు జాతీయ కృగవని పార్కులో అటవీ శాఖ చేపట్టింది. హరిత హారం కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంతో నేడు పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. మానవుని మనుగడ ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సీఐ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ డీకే లక్ష్మి , ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రతీమ, సెక్షన్ ఆఫీసర్ సయ్యద్ కమాలూద్దీన్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, ఎంపీటీసీ బట్టు మల్లేశ్, అంజయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో షాబాద్ సీఐ గురువయ్యగౌడ్, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఎస్ఐలు మహేశ్వర్రెడ్డి, సత్యం, బాలరాజు, చేవెళ్ల ఏసీపీ ప్రభాకర్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అయూమ్, ప్రదీప్, చేవెళ్ల సర్పంచ్ శైలజ, ఎంపీటీసీ వసంతం, తహసీల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితదినోత్సవ కార్యక్రమం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. హరితదినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. యాచారం మండలం గున్గల్ రిజర్వు ఫారెస్టులో జడ్పీటీసీ జంగమ్మ, సహకారసంఘం చైర్మన్ రాజేందర్రెడ్డి, అటవీశాఖ అధికారులు, తహసీల్దార్ సుచరితతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచాల మండలం ఆగాపల్లి రిజర్వు ఫారెస్టులో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆగాపల్లి సర్పంచ్ గోసుల జంగయ్యయాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చలహారంగా మారిందని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలు నాటారు. మైసిగండి గ్రామంలో మొక్కలు నాటి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ తులసీరాంనాయక్, లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీలు మంజుల, ప్రియ, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు లాయక్అలీ, వెంకటయ్య, ఎంపీడీవో రామకృష్ణ, నాయకులు రమేశ్, చంద్రమౌళి, ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మాడ్గుల : మండలంలోని వివిధ గ్రామాల్లో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందుగుల గ్రామంలో సర్పంచ్ జయలక్ష్మి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, బీఆర్ఎస్ నాయకులు నిరంజన్, బైకాని పర్వతాలు, నారయ్య, ముత్తయ్య యాదమ్మ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : ఏర్వగూడ గ్రామంలో హరిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ శ్రీకాంత్ ట్రాక్టర్తో స్వయంగా చెట్లకు నీటిని పోశాడు. డీఆర్డీవో ప్రభాకర్ సర్పంచ్ని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ కృష్ణ మొక్కలను నాటారు. కార్యక్రంలో ఏపీవో కృష్ణ, ఎంపీవో రఘు, నాయకులు జ్యోత్స్న, యాదగిరి, రవి, నర్సింహ, జంగయ్య పాల్గొన్నారు.
ఆమనగల్లు : చింతలపల్లి గ్రామంలో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొప్పు మంజుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ఎంపీడీవో ఫారుక్ హుస్సేన్ హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.