రంగారెడ్డి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది మే 25న విడుదలైన ఓటరు ప్రణాళిక ప్రకారం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితా సవరణను చేపట్టింది. ఆగస్టు 21న ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఓటు నమోదు, తొలగింపులు, మార్పులకు దరఖాస్తులను నాలుగు నెలలపాటు స్వీకరించింది. ఈమేరకు వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బుధవారం తుది జాబితాను విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 33,56,056 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 17,38,994., స్త్రీలు 16,15,876 మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,98,154 ఉండగా.. అత్యల్పంగా షాద్నగర్ నియోజకవర్గంలో 2,25,524 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3,369 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.