చండ్రుగొండ, ఆగస్టు 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మద్యం మత్తులో ఓ బంజారా నాయకుడు వీరంగం సృష్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మద్యం సేవించిన అధికార పార్టీకి చెందిన బంజారా నాయకుడు కార్యాలయంలోకి ప్రవేశించి చండ్రుగొండ సబ్ రిజిస్టర్ జగదీశ్వర్ ప్రసాద్ పై చిందులు వేశాడు. ఇటీవల సమాచార హక్కు ప్రకారం చండ్రుగొండ మండలంలో గల ప్రభుత్వ రెవెన్యూ భూముల వివరాలను తీసుకుని అందులో గిరిజనేతరులు ముఖ్యంగా పేదలు నిర్మించిన ఇండ్లను తొలగించి రెండు కుంటల భూమి తనకు ఇవ్వాలని పరోక్షంగా బెదిరిస్తూ గత కొంతకాలంగా వస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో నేరుగా తాసీల్దార్ తో తనకు భూములను కొలిచి చూపించాలని, ఏ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో ఎంత ఉందో చూపించాలని డిమాండ్ చేశాడు.
లేకుంటే తనకు రెండు కుంటలు భూమి ఇవ్వాలని లేకపోతే నీ అంత చూస్తానని బెదిరించారు. సబ్ రిజిస్ట్రార్ వైపు వేలు చూపిస్తూ ఏక వచనంతో మాట్లాడి అవమానకరంగా వ్యవహరించినట్లు కార్యాలయంలోని రెవెన్యూ అధికారులు బహిరంగంగా తెలుపుతున్నారు. దీనిపై తాసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ ను వివరణ కోరగా తనను గిరిజన నాయకుడు బెదిరించిన మాట వాస్తవమేనని చెప్పారు. అప్పుడు చండ్రుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు వచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం మద్యం సేవించిన విషయం సైతం బ్రీత్ టెస్ట్ చేయలేదని, ఇటువంటి వ్యవస్థ చండ్రుగొండలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.