పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్టింది. తక్కువ మంది స్టూడెంట్స్ ఉండి.. ఎక్కువమంది టీచర్లుంటే మరో స్కూల్కు బదిలీ చేసింది. జిల్లావ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రక్రియ చేపట్టి మొత్తం 155 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. వీరిలో అధికంగా ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్లు)లు 124 మంది ఉన్నారు.
రంగారెడ్డి, జూలై 29, (నమస్తే తెలంగాణ) : శంకర్పల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ విధంగా జిల్లాలోని 100 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం అవసరానికి మించి ఉన్నారు. దీంతో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులను సరిపోను టీచర్లు లేకపోవడంతో జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను సేకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని మండలాల్లోనూ సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడుండేలా జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. సబ్జెక్టుల వారీగా టీచర్ల వివరాలను సేకరించిన అధికారులు మండలాలవారీగా, సబ్జెక్టుల వారీగా టీచర్లను సర్దుబాటు చేశారు. టీచర్ల నియామకం పూర్తై కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీచర్ల హేతుబద్దీకరణ ప్రక్రియను చేపట్టారు. జిల్లాలోని 22 మండలాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు 155 మంది ఉపాధ్యాయులను ఆయా స్కూళ్లకు సర్దుబాటు చేశారు.
గ్రేడుల ఆధారంగా టీచర్ల సర్దుబాటు
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని దాదాపు 100 స్కూళ్లలో సర్దుబాటు ప్రక్రియను చేశారు. ఈ నెల మొదటి వారం నుంచి చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా స్కూళ్లవారీగా విద్యార్థులు ఎంత మంది ఉన్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, ఏయే సబ్జెక్టులకు ఎంత మంది ఉన్నారనే వివరాలను సేకరించి హేతుబద్ధీకరణ చేశారు. మండలాలవారీగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ఎక్కువగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు తక్కువుండి, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండడంతో వందకుపైగా ఎస్జీటీ ఉపాధ్యాయులను ఆయా స్కూళ్లకు సర్దుబాటు చేశారు.
టీచర్ల సర్దుబాటులో భాగంగా జిల్లావ్యాప్తంగా 155 మందిని ఆయా స్కూళ్లకు సర్దుబాటు చేయగా, వీరిలో ఎస్జీటీలు-124, హిందీ భాషా పండితులు-10, తెలుగు భాషా పండితులు-9, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం-3, స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం-4, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్-1, స్కూల్ అసిస్టెంట్ గణితం-3, స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం-1 ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.