తాండూరు, జనవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం తాండూరు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు. శనివారం సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి సీతక్కను కలిసి అభివృద్ధి నిధులకు సంబంధించిన జీవో కాపీని అందుకున్న ట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఆర్ఆర్ కింద రూ.70 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.20 కోట్లు, ఎస్డీఎఫ్ కింద మరో రూ.10 కోట్ల నిధుల విడుదలకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారన్నారు. తాండూరు నియోజకవర్గం తరఫున సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గంలో పాత పనులకు సంబం ధించిన నిధులు రద్దు కావడంతో వెంటనే అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చామన్నారు. విద్య, వైద్యంతోపాటు రోడ్లు, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. తాండూరులో ఐటీఐ కళాశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డితో చర్చించి టాటా కన్సల్టెంట్ సహకారంతో ఐటీఐ కళాశాలను నడిపించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు.