వికారాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తాండూరు కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. మూడు వర్గాలుగా వీడిపోయిన నాయకులు ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచిన బుయ్యని మనోహర్రెడ్డి….పట్నం ఫ్యామిలీ హస్తం పార్టీలో చేరడంతో ఇరకాటంలో పడ్డారు. దీంతో ఈ సెగ్మెంట్లో ఆ పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయింది.
ఓ వైపు ఎమ్మెల్యే వర్గం.. మరోవైపు పట్నం ఫ్యామిలీ.. ఎమ్మెల్యే సోదరుడు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నా రు. తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్రెడ్డి విజయం సాధించిన మూడు నెలలకే వర్గపోరు మొదలు కావడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తాండూరు కాంగ్రెస్లో చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా ఎమ్మెల్యే ఇంట్లోనూ రచ్చ మొదలయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన మనోహర్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి ఎంపీ టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటే.. ఆయనకు ఎమ్మెల్యే సహకరించడం లేదని… ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నట్లు తాండూరులో చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా ఇసుక దందాతోపాటు ఇతరత్రా విషయాల్లోనూ సోదరుడు నేరుగా తలదూర్చుతుండడంతో ఎమ్మెల్యే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఈ సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ వర్గం వైపు ఉండాలో తెలియని అయోమయం నెలకొన్నది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం ఫ్యామిలీకే ఎమ్మెల్యే టికెట్ అంటూ ఇప్పుడే ప్రచారం షురూ కావడంతో మనోహర్రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచిన సంతోషం మూణ్నాళ్ల ముచ్చటగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తాండూరు కాంగ్రెస్లో పైచేయి సాధించేందుకు మూడు వర్గాల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్ మూడు గ్రూపులుగా చీలిపోవడంతో గ్రూ పు రాజకీయాలు మొదలయ్యాయి. ఇసుక దందా మొదలుకొని అధికారుల వద్ద పెత్తనం వరకు అన్నింటిలోనూ ఎవరికి వారు తమ మాటే నెగ్గేలా చూసుకుంటున్నారు. ఓ వైపు ఎమ్మెల్యే సోదరుడు పార్టీలో సెపరేట్ కుంపటి పెట్టి తలనొప్పిగా మారగా.. పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్లో చేరడంతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి సంకట పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యే వర్గం, పట్నం ఫ్యామిలీ, ఎమ్మె ల్యే సోదరుడి వర్గంలో ఎవరి మాట వినాలో తెలియక అధికారుల్లోనూ అయోమయ పరిస్థితి నెలకొన్నది.
ఓ వర్గం వారి మాట వింటే మిగిలిన ఇరు వర్గాల వారు ఇబ్బందులకు గురి చేస్తారని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన పోలీసు, ఇతరత్రా పోస్టింగ్ల్లోనూ తమకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇప్పించేందుకు మూడు వర్గాల నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
అయితే తాండూరులో కొన్నేండ్లుగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి వ్యాపారం చేస్తుండడంతో స్థానికంగా ఉన్న పరిచయాలతో ఎమ్మెల్యే కంటే ఆయన వద్దకే పంచాయితీలు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తాండూ రు కాంగ్రెస్లో ఆయన సోదరుడు యాక్టివ్ రోల్ పోషిస్తున్నట్లు.. సగానికిపైగా క్యాడర్ అతడి వైపే ఉండడంతో ఇష్టం లేకున్నా సోదరుడి మాట ప్రకారమే మనోహర్రెడ్డి ముందుకెళ్తున్నాడనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.
మరోవైపు పట్నం మహేందర్రెడ్డి కుటుంబం ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో ఇద్దరు సోదరుల మధ్య మరింత నిప్పు రాజుకున్నట్లు సమాచారం. పట్నం ఫ్యామిలీకి తాం డూరు సెగ్మెంట్లో పట్టుతోపాటు ప్రత్యేక క్యాడర్ ఉండడంతో ఇకపై ఇక్కడ పెత్తనమంతా ఆ కుటుంబం చేతుల్లోకే వెళ్తుందనే ఆందోళన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, సోదరుడు శ్రీనివాస్రెడ్డి వర్గాల్లో నెలకొన్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ పట్నం కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారికి పార్టీలో ప్రాధాన్యమివ్వొద్దని ఎమ్మెల్యేకు ఆయన వర్గం నాయకులతోపాటు సోదరుడు పదేపదే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తున్నది. తమకు కాకుండా పట్నం వర్గానికి అధిక ప్రాధాన్యమిస్తే మా దారి మేము చూసుకుంటామంటూ ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన ముఖ్యనాయకులు, అనుచరులు మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్రెడ్డి గెలుపొంది నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ పట్నం ఫ్యామిలీకే అంటూ ప్రచారం షురూ అయ్యింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూరు టికెట్ ఆశించగా, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి టికెట్ ఇచ్చి మహేందర్రెడ్డిని అధిష్ఠానం బుజ్జగిం చింది. అయితే పట్నం ఫ్యామిలీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరింది.
సెగ్మెంట్లో తనకంటూ ప్రత్యేక క్యాడర్ను కలిగి ఉన్న పట్నం మహేందర్రెడ్డి రానున్న అసెం బ్లీ ఎన్నికల్లో ఆయన లేదా కుటుంబ సభ్యులు తాండూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వర్గం అయోమయంలో పడిపోయింది. అంతేకాకుండా పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు ఆ వర్గంలో చేరుతున్నట్లు తెలుస్తున్నది. ఓ వైపు సోదరుడి రచ్చ, మరోవైపు పట్నం ఫ్యామిలీ పెత్తనంతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి తలనొప్పిగా మారింది.