Summer holidays | బొంరాస్పేట, ఏప్రిల్ 27 : పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి. గ్రామాల్లో చాలావరకు యువత, పిల్లలు బావులు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారు. కొత్త గా ఈత నేర్చుకోవాలన్నా.. ఎండ వేడి నుంచి ఉప శమనం పొందేందుకు చెరువుల్లో ఈత కొట్టాలన్న ఉత్సాహం ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానీటిలోకి దిగితే ప్రమాదాల బారిన పడే ప్రమా దం ఉన్నది. పట్టణాలు, నగరాల్లో ఉండే పిల్లలు తమ బంధువుల వద్దకు, స్వగ్రామాలకు వస్తుంటారు. వీరికి చెరువులు, నీళ్ల లోతు, ఈత కొట్టడంపై పెద్దగా అవగాహన ఉండదు. ఇలాంటి వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో వేసవి సెలవుల్లో చెరువులు, కుంటల్లోకి ఈతకు వెళ్లి చనిపోయిన సంఘటనలున్నాయి.
జిల్లాలోని చాలా గ్రామా ల్లో చెరువులు, కుంటల్లో ఇప్పటికీ పుష్కలంగా నీళ్లున్నాయి. ఈతరాని పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. కావున తల్లిదండ్రులు పిల్లలను కనిపెడుతూ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈతకు వెళ్లాలనుకుంటే వారి వెంట ఈత వచ్చిన పెద్దలు తప్పక వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల సరదా కుటుంబాల్లో విషాదం నింపకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
– పిల్లలకు ఈత నేర్పే సమయంలో నీటిలో మునిగిపోకుండా కాపాడే లైఫ్ జాకెట్లను వినియోగించాలి.
-చెరువులు, కుంటలు, బావుల లోతు ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవాలి.
-ఈతరాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగొద్దు.
ఒంటరిగా చెరువుల వద్దకు పంపించొద్దు
వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరిగా చెరువులు, కుంటల వద్దకు పంపించొద్దు. ఈతరాని వారు నీళ్లలోకి దిగొద్దు. పిల్లల వెంట తప్పక ఈత వచ్చిన వారు వెళ్లాలి.
-శంకర్, ఎస్ఐ బొంరాస్పేట