సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): ఈ వేసవిలో హైదరాబాద్ మహా నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, అందువల్ల నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జల మండలి స్పష్టం చేస్తోంది. ప్రధాన జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ జలాశయం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా మూడు దశల్లో రోజూ 270 ఎంజీడీల నీటిని తరలిస్తున్నదని, ఈ లెక్కన నెలకు 1.38 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నదన్నారు. మంగళవారం నాటికి సాగర్ నీటి నిల్వ 514.10 అడుగుల మేర ఉన్నదని, ప్రస్తుతం రిజర్వాయర్లో డెడ్ స్టోరేజీ లెవల్ పైన 7.60 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదన్నారు. ఈ వేసవిలో హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఉండదని అధికారులు తెలిపారు. మరోవైపు గోదావరి జలాల కోసం ఎల్లంపల్లి జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు అత్యవసర పంపింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు అవసరాన్ని బట్టి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించేందుకు సమాయత్తమవుతోందని చెప్పారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో సంతృప్తికరమైన నీటి నిల్వలు ఉన్నాయని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నగర ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని జల మండలి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.